పాక్ సైన్యం కాల్పులు, తిప్పికొట్టిన భద్రతా దళాలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్లోని మేంధర్ సెక్టార్లో శనివారం రాత్రి పాకిస్తాన్ సైన్యం కాల్పులకు తెగబడింది.
పాకిస్తాన్ సైన్యం కాల్పులను భారత భద్రతా దళాలు సమర్దవంగా తిప్పికొట్టినట్లు లెప్టినెంట్ జనరల్ సుబ్రతా సాహ వెల్లడించారు. ఇది ఇలా ఉంటే పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ ధోరణి ఇంకోలా ఉంది.
నియంత్రణ రేఖ వెంట నిత్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాక్ సైన్యం సహనాన్ని పరీక్షించవద్దని ఆ దేశ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్, భారత్ కు సూచించారు.
ఇప్పటికే పాకిస్తాన్లో రాజద్రోహం నేరాన్ని ఎదుర్కొంటున్న ఆయన, తాజాగా పాక్ ప్రతిపక్ష నేత ఇమ్రాన్ ఖాన్తో జత కట్టి ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘నియంత్రణ రేఖ వెంట భారత్ నిత్యం కాల్పుల విరమణకు తిలోదకాలిస్తోంది. ఇది మంచి పద్దతి కాదు. పాక్ సైన్యం సహనాన్ని పరీక్షించే ఈ తరహా చర్యలకు భారత్ స్వస్తి చెప్పాలి'' అని ఆయన అన్నారు.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇమ్రాన్ ఖాన్ చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముషార్రఫ్ ఈ మేరకు వ్యాఖ్యానించారు.