ముంబైని ముంచేస్తున్న వర్షాలు: పాత భవనాలు కూలే ప్రమాదం..ఐఎండీ ఆరెంజ్ అలెర్ట్
కరోనా వైరస్ తో విలవిలలాడుతున్న ముంబై నగరంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. శుక్రవారం కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలో పలు ప్రాంతాలు జలమయం కాగా జనజీవనం స్తంభించింది. ముంబై దాని పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.
ముంబై మరియు పరిసర ప్రాంత జిల్లాలకు వర్షాల నేపథ్యంలో ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేశారు.ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో ముంబై నగరం అతలాకుతలమవుతోంది. ఉదయం 6 గంటలనుండి కంటిన్యూగా కురుస్తున్న వర్షాలతో ముంబై నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి . సియోన్ మరియు కుర్లా వంటి ప్రాంతాలు జలమయం కావడంతో వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ నుండి భారీ వర్షాల మధ్య, పాత భవనాలు కూలిపోయే ప్రమాదం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) తెలిపింది. దీంతో స్థానికుల్లో భయం నెలకొంది . ముంబై మరియు పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఇళ్ళ నుండి బయటకు రావద్దని IMD సూచించింది. కనీసం రెండు రోజులు ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని IMD హెచ్చరించింది .
ప్రాంతీయ వాతావరణ శాఖ చెబుతోన్న వివరాల మేరకు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు అనేక ప్రాంతాలు జలమయం అవుతాయని , విద్యుత్ కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. మున్సిపల్ సేవలకు సైతం స్వల్ప అంతరాయం కలగవచ్చని, ప్రధాన రహదారులపై వాహనాలకు, లోకల్ ట్రైన్స్ కు ఇబ్బంది కలగవచ్చునని పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం అధికారులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి విపత్తు ఎదురైనా ఎదుర్కొనేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అయితే కరోనా కేసులు తీవ్రంగా ఉన్న సమయంలో కురుస్తున్న వర్షాలు నగరవాసులకు టెన్షన్ తెప్పిస్తున్నాయి. మరో రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది .












Click it and Unblock the Notifications