దేశవ్యాప్తంగా భారీ వర్షాలు..ఒక్క నాలుగురోజుల్లోనే 100 మంది మృతి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గత నాలుగురోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు దాదాపు 100కు పైగా మృతి చెందారు. ఇందులో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం నుంచే అధికంగా మృతి చెందారు. బీహార్లో కురిసిన వర్షాలకు అక్కడ జీవనం అస్తవ్యస్తంగా మారింది. బీహార్ రాష్ట్రం మొత్తం భారీ వర్షాలతో అతలాకుతలమైంది. రాజధాని పాట్నాలో నీళ్లు మోకాలు అడుగుకు చేరాయి. భారీ వర్షాలకు బీహారీ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
గత 48 గంటల్లో బీహార్లో 18 మంది మృతి
బీహార్లో రుతుపవనాల రాక ఆలస్యంగా జరిగిందని వాతావరణశాఖ చెబుతోంది. దీంతో ఒక్కసారిగా రాష్ట్రాన్ని రుతుపవనాలు ఆవహించడం ఆపై భారీ వర్షాలు కురవడం వెంటవెంటనే జరిగిపోయాయని అధికారులు చెబుతున్నారు. గత 48 గంటల్లో బీహార్లో కురిసిన భారీ వర్షాలకు 18 మంది మృతి చెందారు. చాలామంది గల్లంతయ్యారు. బీహార్లో ప్రస్తుతం పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. చాలా చోట్ల రైలు సేవలు నిలిచిపోయాయి. విద్యుత్కు తీవ్ర అంతరాయం కలిగింది. స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఆరోగ్యశాఖపై కూడా వర్షం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.
గురువారం నుంచి ఇప్పటి వరకు 79 మంది మృతి
ఇదిలా ఉంటే ఉత్తర్ప్రదేశ్లో గురువారం నుంచి కురిసిన భారీ వర్షాలకు 79 మంది మృతి చెందారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన ప్రకారం 25 మంది శనివారం మృతి చెందగ, 18 మంది శుక్రవారం, 36 మంది గురువారం మృతి చెందినట్లుగా పేర్కొంది. ఉత్తరాఖండ్లో కురిసిన వర్షాలకు 13 మంది మృతి చెందారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో కూడా భారీ వర్షాలు కురిశాయి.
నీట మునిగిన పాట్నా నగరం
నాలుగు నెలల పాటు ఉన్న వర్షాకాలం ముందుగా అనుకున్నట్లు సోమవారం ముగియాల్సి ఉంది కానీ ఈ వారాంతం వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర చెప్పారు. రాజస్థాన్, బీహార్, ఉత్తర్ప్రదేశ్లలో వర్షాల ప్రభావం ఇంకా ఉంటుందని చెప్పారు. ఇక బీహార్ రాజధాని పాట్నా నగరం మొత్తం జలమయమైంది. ఓ పెద్ద చెరువును తలపిస్తోంది. చాలా వరకు లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ప్రైవేట్ హాస్పిటళ్లు, మెడికల్ స్టోర్లు ఇతర దుకాణాలు నీటిలో మునిగిపోయాయి.
పాట్నాలో నిలిచిన విద్యుత్ సరఫరా
పాట్నా నగరంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయకచర్యలు చేపడుతున్నారు. కొందరు వరదబాధితులు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన పడవలపై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు. శుక్రవారం నుంచి పాట్నాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు 200 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. అంతేకాదు వరద నీరు చాలా విద్యుత్ సబ్స్టేషన్లలోకి ప్రవేశించిందని దీంతో విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వచ్చిందని అధికారులు వెల్లడించారు.