రాగల 24 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, తెలంగాణలో రేపు, ఎల్లుండి కూడా
అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. మరికొన్ని రోజులపాటు ఈ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం ఒడిశా-కోస్తాంధ్ర తీరానికి సమీపంలో అల్పపీడనం కొనసాగుతోంది.
రాగల 24 గంటల్లో ఈ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే సూచనలున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వాయువ్య దిశగా కదులుతూ ఛత్తీస్ గఢ్, ఒడిశాపై కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో మరో 24 గంటల్లో కోస్తాంధ్ర, తెలంగాణ, ఉత్తర కోస్తా జిల్లాలు, ఒడిశాలోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
Recommended Video
ఆగస్టు 9, 10 తేదీల్లో తెలంగాణల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఇప్పటికే ఏపీ, తెలంగాణలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి కూడా మోస్తరు వర్షాలు పడుతున్నాయి.