కరోనా మహమ్మారి 2021 వరకు, భారత్ జాగ్రత్తగా ఉండాల్సిందే: రాహుల్తో హార్వర్డ్ ప్రొఫెసర్
న్యూఢిల్లీ: భారతదేశంలో సులభతర లాక్డౌన్ మాత్రమే కొనసాగాలని, కఠిన ఆంక్షల వల్ల దేశం మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని యూరోపియన్ సీడీసీలో మాజీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ జోహన్ గీసెకా హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో జరిగిన చర్చలో హార్వర్డ్ ప్రొఫెసర్ అశీష్ ఝా, ప్రొఫెసర్ జోహన్ వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

2021 వరకూ కరోనా..
కరోనా మహమ్మారి 2021 వరకూ ఉంటుందని, ఇప్పట్లో దీనికి వ్యాక్సిన్ వచ్చే అవకాశం కూడా లేదని అశీష్ ఝా అన్నారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఆర్థిక వ్యవస్థను పునరుద్దరించే క్రమంలో ప్రజల్లో విశ్వాసాన్ని పాదుకొల్పాల్సిన అవసరం ఉందని తెలిపారు. కరోనా సమస్య 12-18 నెలలపాటు ఉండే అవకాశం ఉందని, 2021 వరకు కూడా ఈ సమస్య తొలిగే అవకాశం లేదన్నారు.

అది భయంకరమైన ఆలోచన.. జాగ్రత్త అవసరం
భారతీయులు వాడుతున్న బీసీజీ వ్యాక్సిన్ కేవలం మీడియేటర్గానే పనిచేస్తుందని, అది కరోనాను ఎదుర్కొగలదనడానికి ఆధారాలు లేవన్నారు. దేశంలో మంద రోగనిరోధక శక్తి అనేది ఒక భయంకర ఆలోచన అని అన్నారు.
లాక్ డౌన్ ఎత్తివేసి.. ముప్పు పొంచివున్న వారి పట్ల జాగ్రత్త వహించడం, ప్రభుత్వ నిబంధనలను పాటించడం మేలని జోహన్ గీసెకా సూచించారు.

కరోనా ఓ కొత్త పుస్తకం..
కరోనా మహమ్మారి ప్రపంచ గతినే మార్చనుందని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సరికొత్త ప్రపంచం ఆవిష్కృతం కానుందన్నారు. ఆరోగ్య రంగంతోపాటు ప్రపంచీకరణకు మూలస్తంభాలుగా ఉన్న వ్యవస్థల్ని కూడా కరోనా దెబ్బతీస్తోందని అన్నారు. ప్రపంచ చరిత్రలో 9/11 దాడులు ఓ అధ్యాయంలా నిలిస్తే.. కరోనాను ఓ కొత్త పుస్తకంలా భావించాలని రాహుల్ వ్యాఖ్యానించారు.
Recommended Video

లక్షన్నర దాటిన కరోనా కేసులు
కాగా, భారతదేశంలో ఇప్పటి వరకు 1,54,369 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 84,466 యాక్టివ్ కేసులున్నాయి. 65,511 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4381 మంది మరణించారు. మహారాష్ట్రలో అత్యధికంగా 54,545 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1792 మరణాలు సంభవించాయి.












Click it and Unblock the Notifications