మే 25 నుంచి దేశీ విమాన సర్వీసులు.. విమాన టికెట్ ఎలా బుక్ చేసుకోవాలో తెలుసా..
మే 25వ తేదీ నుంచి దేశీయ విమాన సర్వీసులను పునరుద్దరిస్తున్నట్టు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు 2 నెలల తర్వాత విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.ఈ నేపథ్యంలో విమాన టికెట్లను ఎలా బుక్ చేసుకోవాలో తెలుసుకుందాం.
పేటీఎం,గోయిబిబో,యాత్రా,మేక్ మై ట్రిప్,ఇక్సిగో యాప్స్ లేదా వెబ్ సైట్స్లో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మొదట సైట్ లేదా యాప్లోకి లాగిన్ అయి 'ఫ్లైట్స్' ఆప్షన్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీరు బయలుదేరే స్థానం,గమ్య స్థానం వివరాలను ఎంటర్ చేయాలి. అలాగే ఎంతమంది ప్రయాణిస్తున్నారు.. ఏ క్లాసులో ప్రయాణించాలనుకుంటున్నారో తెలపాలి. ఒకవేళ రిటర్న్ జర్నీకి కూడా టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే.. ఆ తేదీలను కూడా ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేస్తే అందుబాటులో ఉన్న విమాన సర్వీసుల వివరాలు స్క్రీన్పై కనిపిస్తాయి. ఆ తర్వాత సెలెక్ట్ ఫ్లైట్>ఫిల్ ప్యాసింజర్ డిటైల్స్>సెలెక్ట్ సీట్>కంటిన్యూ.. ప్రొసీజర్ ఫాలో కావాలి. ప్రోమో కోడ్స్ అప్లై చేయడం ద్వారా ప్రయాణ చార్జీలను తగ్గించుకోవచ్చు. అన్ని యాప్స్లోనూ దాదాపుగా ఇదే ప్రొసీజర్ ఉంటుంది.
ఇక దేశీ విమానాలకు సంబంధించిన చార్జీలను కేంద్రం తాజాగా సవరించింది. ప్రయాణ సమయాన్ని బట్టి ధరలు ఉంటాయని తెలిపింది. ప్రయాణికులకు,ఎయిర్ లైన్స్కు ఇరువురికి ప్రయోజనం చేకూరేలా ధరలను నిర్ణయించినట్టు వెల్లడించింది.
ఎయిర్ లైన్స్ ధరలను మొత్తం 7 కేటగిరీలుగా విభజించింది. ఈ ధరలు మే 25 నుంచి అగస్టు 24 వరకు అమల్లో ఉంటాయని చెప్పింది. అన్ని విమాన సర్వీసుల్లో 40శాతం టికెట్లు సగటు ధరకు విక్రయించాలని సూచించింది.మొదట పరిమితి సంఖ్యలోనే విమానాలను పునరుద్దరణకు అనుమతించినప్పటికీ.. ప్రయాణికుల స్పందనను బట్టి విమాన సర్వీసులను పెంచే అవకాశం ఉంది.
డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) నిర్ణయించిన ప్రకారం... 40 నిమిషాల కంటే తక్కువ ప్రయాణ సమయానికి కనిష్టంగా రూ.2వేలు,గరిష్టంగా రూ.6వేలు టికెట్ ధరగా నిర్ణయించింది.
ప్రయాణ సమయం 40 నిమిషాల నుంచి 60నిమిషాల వరకు ఉంటే టికెట్ ధర కనిష్టంగా రూ.2500,గరిష్టంగా రూ.7500 వరకు ఉంటుంది.
ప్రయాణ సమయం 60 నిమిషాల నుంచి 90 నిమిషాల వరకు ఉంటే టికెట్ ధర కనిష్టంగా రూ.3000,గరిష్టంగా రూ.9000 వరకు ఉంటుంది.
Recommended Video
ఢిల్లీ-ముంబై తరహాలో.. ప్రయాణ సమయం 90 నిమిషాల నుంచి 120 నిమిషాల వరకు ఉంటే టికెట్ ధర కనిష్టంగా రూ.3500,గరిష్టంగా రూ.10000 టికెట్ వరకు ఉంటుంది.
ప్రయాణ సమయం 150 నిమిషాల నుంచి 180 నిమిషాల వరకు ఉంటే టికెట్ ధర కనిష్టంగా రూ.5500,గరిష్టంగా రూ.15,700 వరకు ఉంటుంది.
ప్రయాణ సమయం 180 నిమిషాల నుంచి 210 నిమిషాల వరకు ఉంటే టికెట్ ధర కనిష్టంగా రూ.6500,గరిష్టంగా రూ.18,600 వరకు ఉంటుంది.