ట్రంప్-మోదీ భారీ రోడ్ షో రద్దు? లేదంటే ‘సబర్మతి’ సదర్శన క్యాన్సిల్? షెడ్యూల్ పూర్తి వివరాలివే..
''నేను భారత్ లోకి అడుగుపెట్టగానే కనీసం 70 లక్షల మందితో స్వాగతం పలుకుతానని ప్రధాని మోదీ మాటిచ్చారు'' అని ఒకసారి.. ''70 లక్షలు కాదు.. మొత్తం కోటి మంది ఇండియన్లు నా రాక కోసం అహ్మదాబాద్ లో ఎదురుచూస్తుంటారనుకుంటా'' అని మరోసారి.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు చేయడంతో అహ్మదాబాద్ రోడ్ షోకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. అయితే, గాంధీజీ సబర్మతి ఆశ్రమాన్ని కూడా ట్రంప్ సందర్శింల్సి ఉండటంతో రోడ్డు షో రద్దు.. లేదంటే 22 కిలోమీటర్లకు బదులు 9కిలోమీటర్లకు కుదించే విషయమై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. దీనికి సంబంధించిన వివరణతోపాటు ట్రంప్ షెడ్యూల్ పూర్తి వివరాలిలా ఉన్నాయి..

రోడ్ షోనా? గాంధీజీ ఆశ్రమమా?
డొనాల్డ్ ట్రంప్ తన బృందంతో కలిసి సోమవారం ఉదయం 11:55కు అహ్మదాబాద్ లో దిగుతారు. ముందుగా సబర్మతి ఆశ్రమ సందర్శనతో అమెరికా ప్రెసిడెంట్ భారత పర్యటన ప్రారంభిస్తారని అంతా భావించారు. ఈమేరకు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ అధికారిక ప్రకటన కూడా చేశారు. అదే సమయంలో ట్రంప్.. ఎయిర్పోర్ట్ నుంచి మోతెరా స్టేడియం వరకు మోదీతో కలిసి భారీ రోడ్ షో చేయనున్నారు. దీంతో సబర్మతి సందర్శన రద్దయ్యేపరిస్థితి నెలకొంది. ప్రపంచవ్యాప్తంగా గాంధీజీకి ఉన్న గౌరవమర్యాదల నేపథ్యంలో ట్రంప్ ఆ పని చేయబోరనే అభిప్రాయం కూడా వెల్లడవుతోంది. అలాంటప్పుడు రోడ్డు షోను రద్దు చేసుకోడం అనే ఆప్షన్ ను కూడా రెండు దేశాల అధికారులు సీరియస్ గా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అదీగాక..

22కాదు.. 9కిలోమీటర్లే?
రోడ్ షో ద్వారా ట్రంప్-మోదీ నేరుగా మోతేరా స్టేడియానికి చేరుకుని ‘నమస్తే ట్రంప్' కార్యక్రమంలో పాల్గొనాల్సిఉంది. అయితే ముందుగా అనుకున్నట్లు ఎయిర్ పోర్టు నుంచి స్టేడియానికి మధ్యఉన్న 22 కిలోమీటర్ల మేరా రోడ్ షో చేయకుండా.. కేవలం 9 కిలోమీటర్లు మాత్రమే కార్యక్రమం నిర్వహిస్తారని తెలుస్తోంది. తద్వారా ఆదా అయ్యే సమయంలో ట్రంప్ కుటుంబం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించుకోవచ్చని అధికారులు సూచించినట్లు వార్తలు వచ్చాయి. ట్రంప్ ముందుగా రోడ్ షోలో పాల్గొంటారా? నేరుగా గాంధీజీ ఆశ్రమానికి వెళతారా? లేక రోడ్ షో తర్వాత ఆశ్రమానికి వెళ్లి.. అక్కడి నుంచి స్టేడియానికి వస్తారా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటిదాకా వెల్లడైన వివరాల ప్రకారం ట్రంప్ ఏం చెయ్యబోతున్నారంటే..

తొలిరోజు షెడ్యూల్ ఇది..
సోమవారం ఉదయం 11:55కు ట్రంప్ టీమ్ అహ్మదాబాద్ చేరుకుంటారు
మధ్యాహ్నం 12:00 ఎయిర్ పోర్టు నుంచి మోదీతో కలిసి రోడ్ షో
మధ్యాహ్నం 12:30 మోతెరా స్టేడియంలో నమస్తే ట్రంప్ కార్యక్రమం
సాయంత్రం 3:30 అహ్మదాబాద్ నుంచి ఆగ్రా బయలుదేరుతారు
సాయంత్రం 5:10 తాజ్మహల్ సందర్శన
రాత్రి 7:30 ఢిల్లీ ఎయిర్పోర్టుకు ట్రంప్
రాత్రి 745: తాము బస చేయనున్న మౌర్య హోటల్ కు ట్రంప్ దంపతులు
తొలిరోజు షెడ్యూల్ లో సబర్మతి ఆశ్రమ సందర్శన లేదు. అయినప్పటికీ చివరినిమిషంలోనైనా ట్రంప్ కచ్చితంగా వస్తారన్న ఆశ్రమ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు ఘనంగా ఏర్పాట్లు కూడా చేశారు.

రెండో రోజు షెడ్యూల్..
మంగళవారం ఉదయం 9:55కు రాష్ట్రపతి భవన్లో ట్రంప్ కు సైనికుల గౌరవవందనం
ఉదయం 10:45 రాజ్ఘాట్లో నివాళులు
ఉదయం 11:25 హైదరాబాద్ హౌస్లో మోదీ-ట్రంప్ ఉమ్మడి మీడియా సమావేశం, మోదీ, ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు
అదే సమయంలో మెలానియా ఢిల్లీలోని ప్రభుత్వ స్కూల్ ను సందర్శిస్తారు.
మధ్యాహ్నం 12:55 అమెరికా ఎంబసీ సిబ్బందితో ట్రంప్ భేటీ
రాత్రి 8:00 రాష్ట్రపతి భవన్లో ట్రంప్ దంపతులకు విందు
రాత్రి 10:00 అమెరికాకు బయల్దేరనున్న ట్రంప్












Click it and Unblock the Notifications