ఆగస్ట్ 15 కు ముందు ఢిల్లీలో హై అలెర్ట్ : భారీగా ఆయుధాలతో నలుగురు అరెస్ట్ , ఉగ్ర కుట్ర భగ్నం
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సమయం ఆసన్నం అవుతున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈరోజు ఢిల్లీ వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టిన ప్రత్యేక బ్రాంచ్ పోలీసులు భారీ ఉగ్ర కుట్రను భగ్నం చేశారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుండి 55 పిస్తోళ్ళు, 50 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితుల నుండి 55 సెమీ ఆటోమేటిక్ పిస్టల్స్ , 50 లైవ్ క్యాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్న ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ నిందితులను దర్యాప్తు చేస్తోంది.
స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టార్గెట్ చేస్తూ దాడులకు ఛాన్స్
శుక్రవారం స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు భారీ ఆయుధాలు మరియు మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకోవడంతో భారీ ఉగ్ర కుట్ర ను భగ్నం చేసినట్లుగా భావిస్తున్నారు. అరెస్టయిన వ్యక్తులలో ఒకరు ఢిల్లీ వాసి కాగా మిగతావారు ఉత్తరప్రదేశ్కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. దేశ రాజధాని ఢిల్లీలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను టార్గెట్ చేస్తూ దాడులకు, హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎర్రకోట లోపలకి ఎవరు వెళ్లకుండా ఉండేలా కంటెయినర్లతో పెద్ద గోడ కట్టారు. అదనపు పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
సోదాలు చేసిన పోలీసులు , నలుగురు అరెస్ట్
ఇక ఈరోజు పోలీసులు అరెస్టు చేసిన వారి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లను, కొన్ని సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. అరెస్టయిన నిందితులలో ఒకరు కౌశల్ గ్యాంగ్కి సన్నిహితుడు మరియు హర్యానా మరియు ఢిల్లీలో నమోదైన రెండు హత్య కేసులలో మోస్ట్ వాంటెడ్ గా ఉన్నాడని పోలీసులు చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందు ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు మరియు పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు, భద్రతా సంస్థల సమన్వయంతో నగరం అంతటా అనేక కంపెనీల కమాండోలను మోహరించారు.
రైతుల ఆందోళనల నేపధ్యంలో హింసాత్మక ఘటనలకు ఛాన్స్
ఢిల్లీ పోలీసులు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు మరియు భద్రతా సంస్థల సహకారంతో భద్రతా ప్రణాళికను రూపొందించి భారీగా బలగాలను మోహరించారు. దేశంలోని అన్ని సరిహద్దులలో పోలీసు బలగాలు మోహరించబడ్డాయని, బారికేడ్లు ఏర్పాటు చేశామని ఢిల్లీ పోలీసు ప్రతినిధి చిన్మయ్ బిశ్వాల్ వెల్లడించారు. ఒకపక్క దేశ రాజధాని ఢిల్లీలో రైతులు మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్న సమయంలో, స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా తమ ఆందోళన తెలియజేసే అవకాశం ఉన్న కారణంగా గత రిపబ్లిక్ డే అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నిరసన తెలియజేస్తున్న ప్రాంతాలలోనూ భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
ఎర్రకోట వద్ద భద్రత పెంపు .. ఢిల్లీలో హై అలెర్ట్
దేశ రాజధానిలోని అన్ని రోడ్లు, హైవేలు మరియు ఇతర మార్గాలలో కూడా భారీగా నిఘా పెట్టినట్టు వెల్లడించారు. ఇక దేశ రాజధాని ఢిల్లీ లో ప్రవేశించే వాహనాలను తనిఖీ చేస్తున్న పోలీసులు సంఘ విద్రోహ శక్తులు, దేశ వ్యతిరేకులు రాజధాని నగరంలోకి రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఎర్రకోట పరిసరాల్లో భద్రతను పెంచిన కేంద్రం, ప్రజలను రెడ్ ఫోర్ట్ పరిసరాల్లోకి అనుమతించటం లేదు. ఎర్రకోట ప్రధాన ద్వారం వద్ద అడ్డంగా భారీ కంటైనర్లను ఏర్పాటు చేశారు. ఈ కంటైనర్లతో భారీ గోడనే నిర్మించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆగస్టు 15న ఎర్ర కోట నుంచి ప్రసంగిస్తారు. ఈ సమయంలో ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా ఇప్పటి నుండే భద్రత కట్టుదిట్టం చేస్తున్నారు .