తల్లీ, కుమార్తె గ్యాంగ్ రేప్: సుమోటోగా తీసుకున్న హైకోర్టు
అలహాబాద్: బులందర్ షహర్ లో తల్లి, కుమార్తెను గ్యాంగ్ రేప్ చేసిన కేసును అలహాబాద్ హై కోర్టు సుమోటోగా స్వీకరించింది. ఓ మహిళతో పాటు ఆమె కుమార్తె (మైనర్) ను అతి దారుణంగా గ్యాంగ్ రేప్ చేసిన కేసును సోమవారం హైకోర్టు విచారణ చేసింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని జాతీయ రహదారి 91లో తల్లీ, కుమార్తెపై గ్యాంగ్ రేప్ జరిగిన విషయం తెలిసిందే. క్రిమినల్ ప్రయోజనాల వ్యాజ్యం లిస్టులో చేర్చబడిన ఈ కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బాబాసాహెబ్ భోసలే, జస్టిస్ యశ్వంత్ వర్మతో కూడిన డివిజన్ బెంచ్ విచారణకు స్వీకరించింది.
జులై 29వ తేదిన ఉత్తర్ ప్రదేశ్ లోని ఢిల్లీ- కాన్పూర్ జాతీయ రహదారిపై కారులో వెలుతున్న తల్లీ, కుమార్తెను వాహనంలో నుంచి కిందకు దింపి వారి కుటుంబ సభ్యుల ముందే దారుణంగా గ్యాంగ్ రేప్ చేశారు.
ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. విషయం తెలుసుకున్న ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ బాధితులకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. తప్పు చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం పోలీసు అధికారులకు సూచించారు.
ఈ తల్లీ, కుమార్తె గ్యాంగ్ రేప్ కేసులో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు తరలించారు. ఈ గ్యాంగ్ ముఠా నాయకుడు సలీం బబారియాతో పాటు ఇతర నిందితుల కోసం గాలిస్తున్నామని పోలీసులు కోర్టులో చెప్పారు.