ఢిల్లీలో రెండోరోజూ హైటెన్షన్- ఈడీ ఆఫీసుకు మళ్లీ రాహుల్ ర్యాలీ-పోలీసులతో ఘర్షణ
ఢిల్లీలో రెండోరోజూ హైటెన్షన్ కొనసాగుతోంది. నేషనల్ హెరాల్డ్ మనీలాండింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని నిన్న ప్రశ్నించిన ఈడీ.. ఇవాళ కూడా రమ్మని కోరింది. దీంతో ఆయన ఇవాళ కూడా విచారణకు హాజరయ్యారు. అంతకు ముందు ఏఐసీసీ ఆఫీసు వద్ద నిన్నటి దృశ్యాలే రిపీట్ అయ్యాయి.
రాహుల్ పై ఈడీ విచారణకు నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు భారీగా ఏఐసీసీ కార్యాలయానికి తరలివచ్చారు. కాంగ్రెస్ పార్టీ సీఎంలు అశోక్ గెహ్లాట్, భూపేష్ భగేల్ కూడా వచ్చారు. వీరితో కలిసి రాహుల్ గాంధీ ఇవాళ రెండో రోజు ఈడీ విచారణకు బయలుదేరారు. మధ్యలో పోలీసులు కార్యకర్తల్ని అడ్డుకున్నారు. ఢిల్లీలో భారీ భద్రత ఏర్పాటు చేసి కాంగ్రెస్ నేతల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకూ కాంగ్రెస్ నేతలకూ మధ్యతీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. అయినా పోలీసుల్ని లెక్క చేయకుండా కాంగ్రెస్ కార్యకర్తలు ముందుకు దూకారు.
తొలిరోజు విచారణలో రాహుల్ గాంధీపై దాదాపు 10 గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించిన ఈడీ అధికారులు.. ఇవాళ రెండోరోజు కూడా నేషనల్ హెరాల్డ్ కేసుపై ఆయన్ను ప్రశ్నిస్తున్నారు.అయితే తొలిరోజు రాహుల్ ఇచ్చిన సమాధానాలపై ఈడీ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రెండో రోజు విచారణ కీలకంగా మారింది. అయితే ఇవాళ కూడా రాహుల్ అదే వైఖరి ప్రదర్శిస్తే ఈడీ తీసుబోబోయే చర్యలపై ఆసక్తి నెలకొంది. దీంతో ఇవాళ రాహుల్ విచారణ ముగిసేవరకూ ఢిల్లీలో హైటెన్షన్ కొనసాగే అవకాశముంది.