Hindu lives matter: హిందువులకు రక్షణ కోసం నటి ప్రణీత సుభాష్ ఉద్యమం
బెంగళూరు: రాజస్థాన్లోని ఉదయ్పూర్లో టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం.. యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇద్దరు ముస్లింల చేతుల్లో అతను దారుణ హత్యకు గురయ్యాడు. నడిరోడ్డు మీద తల నరికారు నిందితులు. ఈ ఘటన తరువాత రాజస్థాన్ అట్టుడికింది. ఈ హత్యను నిరసిస్తూ పెద్ద ఎత్తున ప్రదర్శనలు నిర్వహించారు. ఆందోళనకు దిగారు. రోడ్డు మీద టైర్లను తగులబెట్టారు. వాహనాల రాకపోకలను స్థానికులు అడ్డుకున్నారు. బంద్ పాటించారు.
మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భారతీయ జనతా పార్టీ మాజీ నాయకురాలు నుపుర్ శర్మకు అనుకూలంగా కామెంట్స్ చేశారనే కారణంతో గౌస్ మహ్మద్, రియాజ్ అఖ్తారీ అనే ఇద్దరు కన్హయ్యలాల్ను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. హత్య చేసిన కొన్ని గంటల్లోనే వారిని పోలీసులు గుర్తించారు. కటకటాల వెనక్కి నెట్టారు. ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఎంట్రీ ఇచ్చింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసింది. ఉగ్రవాద చర్య అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టింది.
పాకిస్తాన్ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహిస్తోన్న దావత్-ఇ-ఇస్లామీ అనే కరడుగట్టిన మత ఛాందసవాద సంస్థతో వారికి సంబంధాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమౌతోన్నాయి. సున్నీ ముస్లిం ఆర్గనైజేషన్ ఇది. ఆన్లైన్ ద్వారా ఇస్లామిక్ బోధనలను చాటుతుంటుంది. టెలివిజన్ ఛానల్ను కూడా నడిపిస్తోంది. 1981లో లాహోర్లో మౌలానా ఇల్యాస్ అట్టారీ దీన్ని నెలకొల్పారు. ఈ ఛానల్ ద్వారా నిందితులు ప్రభావితం అయ్యారనే అభిప్రాయాలు ఉన్నాయి.
Is anyone listening? pic.twitter.com/ecu4tjAfYD
— Pranitha Subhash (@pranitasubhash) June 29, 2022
టైలర్ కన్హయ్య లాల్ హ్యతోదంతం అనంతరం హిందు సంఘాలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలను వ్యక్తం చేస్తోన్నాయి. ప్రముఖ నటి ప్రణీత సుభాష్.. వారితో జత కలిశారు. హిందూ లైవ్స్ మ్యాటర్ (Hindu lives matter) అని రాసివున్న ప్లకార్డ్ను ప్రదర్శించారు. దీన్ని పట్టుకుని ఉన్న ఓ ఫొటోను ఆమె కొద్దిసేపటి కిందటే తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై పోస్ట్ చేశారు. ఈజ్ ఎనీ వన్ లిజనింగ్.. అనే కామెంట్ను జత చేశారు. దీనికి ప్రతిగా చాలామంది నెటిజన్లు అదే తరహాలో ప్లకార్డ్ను పట్టుకుని ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.