అయోధ్యపై తీర్పులో షాకింగ్ ట్విస్ట్: తీర్పును వ్యతిరేకంగా హిందు మహాసభ రివ్యూ పిటీషన్..!
న్యూఢిల్లీ: చారిత్రాత్మకమైన అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదం కేసులో క్రమంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం ఇఛ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ హిందు మహాసభ రివ్యూ పిటీషన్ వేయాలని నిర్ణయించుకుంది. తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయనున్నట్లు హిందూ మహాసభ ప్రతినిధులు ధృవీకరించారు.

అయిదెకరాలను ఇవ్వడాన్ని నిరాకరిస్తూ..
అయోధ్య భూవివాదం కేసులో సుప్రీంకోర్టు.. హిందువులకు అనుకూలంగా వెలువడించిన విషయం తెలిసిందే. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ్ లల్లా విరాజ్ మాన్ కు చెందుతుందని, దీనికి ప్రత్యామ్నాయంగా ముస్లిం పార్టీలకు అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించాల్సి ఉంటుందని వెల్లడించింది. ముస్లిం పార్టీలకు అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ హిందు మహాసభ రివ్యూ పిటీషన్ ను దాఖలు చేయనుంది.

ముస్లిం పార్టీల నిర్ణయ ఫలితంగానే..
రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ముస్లిం పార్టీలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ వేయాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. జమాతె ఉలేమా-ఇ-హింద్ సంస్థ ఇప్పటికే రివ్యూ పిటీషన్ వేసింది కూడా. ఇక అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా అదే బాటలో నడవనుంది. త్వరలోనే ముస్లిం పర్సనల్ లా బోర్డు సైతం రివ్యూను కోరుతూ పిటీషన్ వేయబోతోంది.

కథ నడిపిస్తోన్న వీహెచ్ పీ..
ముస్లిం పార్టీల తరఫున జమాతె ఉలేమా రివ్యూను కోరడం, ముస్లిం పర్సనల్ లా బోర్డు..తాము కూడా పునఃసమీక్షను కోరుతామని ప్రకటించిన నేపథ్యంలో విశ్వహిందూ పరిషత్ తెరమీదికి వచ్చింది. ఈ రెండు సంస్థలకు ధీటుగా తాము కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. తమ ప్రతినిధిగా హిందు మహాసభను బరిలోకి దించింది. హిందు మహాసభ తరఫున త్వరలోనే రివ్యూ పిటీషన్ ను వేయబోతున్నట్లు ప్రముఖ న్యాయవాది విష్ణుకుమార్ జైన్ వెల్లడించారు.

ముస్లింలకు ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపుపై అభ్యంతరం..
ముస్లిం పార్టీలకు అయిదు ఎకరాల స్థలాన్ని కేటాయించడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని, ప్రత్యామ్నాయ స్థలాన్ని కేటాయిస్తూ వెలువరించిన తీర్పును పునఃసమీక్షించాలని కోరబోతున్నట్లు ఆయన తెలిపారు. న్యాయపరంగా, చట్టపరంగా వివాదాస్పద స్థలం హిందువులకే చెందుతున్నప్పుడు.. ముస్లింలకు అయిదు ఎకరాలను ఎందుకు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడిందని, దీన్ని వెనక్కి తీసుకోవాలని తాము సుప్రీంకోర్టును కోరున్నట్లు విష్ణుకుమార్ జైన్ తెలిపారు.












Click it and Unblock the Notifications