ఉచిత బస్సు ప్రయాణం కోసం బుర్ఖా వేసుకున్న వ్యక్తి; మరీ ఇంత దారుణమా!!
కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణం పథకం రోజుకో రకమైన చర్చలకు కారణంగా మారుతుంది. తాజాగా మరొక ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఒక హిందు వ్యక్తి బస్సులో ఉచిత ప్రయాణం చేయడం కోసం బుర్ఖా ధరించాడు అన్న వార్త ప్రస్తుతం వైరల్ గా మారుతుంది.
అయితే బస్టాండ్లో వెయిట్ చేస్తున్న వీరభద్రయ్య మఠాపతిని చూసిన కొందరికి బుర్ఖా ధరించిన అతని వాలకం అనుమానాలకు కారణమైంది. దీంతో వారు నువ్వు ఎవరు? ఇక్కడకు ఎందుకు వచ్చావు అంటూ ప్రశ్నించారు. పురుషుడివి బుర్ఖా ఎందుకు ధరించావు అంటూ అతడిని నిలదీశారు. అయితే అతను తాను బిక్షాటన చేయడం కోసం బుర్ఖా ధరించినట్లు చెప్పుకొచ్చాడు. ఒక మహిళకు చెందిన ఆధార్ కార్డు ఉండటంతో అతనిపై అందరికి మరింత అనుమానాలు బలపడ్డాయి.

ఇది ఉచిత బస్సు ప్రయాణం కోసం జరుగుతున్న తంతు అంటూ పలువురు సోషల్ మీడియా వేదికగా బుర్ఖ ధరించిన హిందూ వ్యక్తికి సంబంధించిన వీడియోను వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న మహిళలకు ఉచిత బస్ పథకం రోజుకో వార్తతో అభాసుపాలవుతుంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేసిన ఐదు ఎన్నికల వాగ్దానాలలో మహిళలకు ఉచిత బస్సు సేవలను అందించటం ఒకటి. ఇక ఎన్నికల హామీలను నెరవేర్చడంలో భాగంగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ జూన్ 11వ తేదీన మహిళల కోసం శక్తి యోజన పేరుతో ఉచిత బస్సు సర్వీస్ పథకాన్ని ప్రారంభించింది.

ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుండి అనేక వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా ఎన్నో వీడియోలు, వార్తలు ఈ పథకం ఏవిధంగా దుర్వినియోగం అవుతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఇదంతా కావాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు ప్రత్యర్థులు చేస్తున్న ప్రచారంగా కాంగ్రెస్ వర్గాలు ఖండిస్తున్నాయి.












Click it and Unblock the Notifications