హిందూ-ముస్లిం లవ్ స్టోరీ: ‘‘అయిదు నెలల తర్వాత నా కొడుకు తండ్రికి పెళ్లీడు వస్తుంది. అప్పుడు మేం ముగ్గురం కలిసి ఉంటాం’’
"నేను అనాథను. మా మేనత్త దగ్గర పెరిగాను. మా ఇంటి దగ్గర్లో ఉండే హిందూ అబ్బాయిని ప్రేమించాను. మాది ముస్లిం కుటుంబం కాబట్టి మా ప్రేమకు మా కుటుంబాలు ఒప్పుకోలేదు. చివరికి పారిపోయి పెళ్లి చేసుకున్నాం"
''నేను గర్భవతిని అయ్యాక మా కుటుంబ సభ్యులు మేం ఎక్కడున్నమో గుర్తించారు. నాకు అబార్షన్ చేయించాలని మా కుటుంబీకులు అనుకున్నారు. కానీ అది కుదరలేదు. నా భర్త యుక్త వయస్కుడు కాకపోవడంతో నాపై కేసు పెట్టారు. మా ప్రేమకు గుర్తుగా నేను బాబుకు జన్మనిచ్చాను''
''ఐదు నెలల తర్వాత నా భర్త వివాహానికి అర్హత సాధిస్తాడు. మా బిడ్డను చైల్డ్ కేర్ సెంటర్ నుంచి తీసుకొచ్చి మేము కొత్త జీవితం ప్రారంభిస్తాం''
ప్రస్తుతం అహ్మదాబాద్లో తన తాతయ్యతో కలిసి ఉంటున్న 19 ఏళ్ల సైరా (పేరు మార్చాం) చెప్పిన మాటలివి.
"నా చిన్నతనంలోనే అమ్మా నాన్నా చనిపోయారు. మా తాతయ్య ఆర్థిక పరిస్థితి బాగాలేక పోవడంతో నన్ను పెంచే బాధ్యతను మా అత్త తీసుకుంది" అని సైరా బీబీసీతో అన్నారు.
సైరా పదో తరగతి వరకు చదివారు. అనాథ అయిన సైరా, తన కాళ్లపై తాను నిలబడాలనుకునేవారు.
''నాకు 18 ఏళ్ల వయసులో ఇంట్లో నా పెళ్లి గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే నాకు మా వీధిలో ఉండే విపుల్తో పరిచయం ఏర్పడింది. మధ్యప్రదేశ్ నుంచి వచ్చి ఉద్యోగం చేస్తున్న విపుల్, ఇక్కడే ఉండేవాడు'' అని సైరా వెల్లడించారు.
సైరా, విపుల్ ఇద్దరూ ప్రేమలో పడ్డారు. కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు.
''విపుల్ పెయింటింగ్, బిల్డింగ్ రిపేర్ల కాంట్రాక్టులు తీసుకునేవాడు. జీవితాంతం కలిసి ఉంటానని నాకు ప్రమాణం చేశాడు'' అని సైరా చెప్పారు.
''నేనూ, విపుల్ భార్యాభర్తల్లా జీవించడం మొదలుపెట్టాం. ఆ సమయంలోనే నేను గర్భవతిని అయ్యాను. విపుల్తో పెళ్లి గురించి నేను మా అత్తతో మాట్లాడాను. విపుల్ కూడా వాళ్ల కుటుంబంతో మాట్లాడాడు'' అన్నారు సైరా.
"విపుల్ హిందువు. మేం ముస్లింలం. రెండు కుటుంబాలు మా పెళ్లిని అంగీకరించడానికి సిద్ధంగా లేవు. నేను అప్పటికే నెలన్నర గర్భవతిని. దీంతో మేం పారిపోవాలని నిర్ణయించుకున్నాం. మేం ఇంటి నుండి పారిపోయిన రోజుల్లోనే కరోనా సెకండ్ వేవ్ మొదలైంది'' అని వివరించారు సైరా.
సెకండ్ వేవ్లో సమస్యలు
2021 మార్చి తర్వాత దేశవ్యాప్తంగా కరోనావైరస్ సెకండ్ వేవ్ మొదలైంది. చాలామందిలాగే విపుల్ కూడా ఉద్యోగం కోల్పోయారు. విపుల్కు వివాహార్హత వయసు లేకపోవడం వారికి మరో సమస్యగా మారింది.
"మాకు పని దొరక్కపోవడంతో విపుల్ తన స్నేహితుడిని డబ్బు అడిగాడు. దీని ఆధారంగా మేం ఎక్కడున్నామో మా రెండు కుటుంబాలు గుర్తించాయి" అని సైరా చెప్పారు.
"అప్పుడు నేను ఆరు నెలల గర్భిణిని. విపుల్ వయస్సు 20 సంవత్సరాలు. రెండు కుటుంబాలు మమ్మల్ని గుర్తించేనాటికి నేను మాత్రమే మేజర్ను. విపుల్కు పెళ్లి వయసు రాలేదు. కాబట్టి, మా అబ్బాయిని తీసుకెళ్లినందుకు కేసు నాపై పెడతామని విపుల్ కుటుంబం మమ్మల్ని బెదిరించింది. మా కుటుంబం చాలా భయపడింది. పెళ్లి చేసుకోకుండా విడిగా ఉంటామని ఒప్పుకున్నాం. కానీ, తనకు 21 ఏళ్లు వచ్చాక, మళ్లీ పారిపోయి పెళ్లి చేసుకుందామని ఇద్దరం ఎదురు చూస్తున్నాం'' అన్నారు.
"రాజీలో భాగంగా, మేము ఒకరినొకరు చూసుకోలేకపోయాం. విపుల్ను అతని బంధువు ఒకరు మధ్యప్రదేశ్ పంపించాడు. మా అత్త నన్ను అబార్షన్ కోసం డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లింది" అన్నారు సైరా.
సైరా, విపుల్ ఇద్దరూ తమ సంతానాన్ని వదులుకోవాలని అనుకోవడం లేదు.
''అబార్షన్ను నేను వ్యతిరేకించాను. అదే సమయంలో ప్రెగ్నెన్సీ కారణంగా నా శరీరంలో వస్తున్న మార్పులపై ఇరుగుపొరుగు వారిలో గుసగుసలు మొదలయ్యాయి'' అని సైరా చెప్పారు.
''నేను అబార్షన్ చేయించుకోవడానికి సిద్ధంగా లేను. దీంతో నన్ను ఆనంద్లోని ఒక సంస్థలో ఉంచారు. అక్కడే నేను ప్రసవించాను. పుట్టిన బిడ్డను చైల్డ్ కేర్ సెంటర్లో ఉంచాలని మా అత్త బలవంత పెట్టింది" అన్నారు సైరా.
- రాజ కుటుంబాన్ని కోట్ల సంపదను వదులుకుని 'సామాన్యుడిని' ప్రేమించి పెళ్లాడిన జపాన్ రాజకుమారి
- కర్ణాటక: మతాంతర ప్రేమలపై ఆగ్రహం, నాలుగు వారాల్లో ఇద్దరి హత్య
ఆదుకున్న మహిళా సంఘం
''మా బంధువులు నాకు మా మతానికి చెందిన వ్యక్తితో పెళ్లి కోసం బలవంతపెట్టారు. మూడుసార్లు నాకు పెళ్లి చేయబోయారు. అప్పుడు నేను 'అభయం' సంస్థ సహాయం తీసుకున్నాను'' అని సైరా వెల్లడించారు.
మహిళా సాధికారతకు కృషి చేసే ఈ సంస్థ గుజరాత్లోని ఆనంద్ కేంద్రంగా పని చేస్తుంది. ఈ సంస్థ సైరాకు సహాయం చేసింది.
''ఆ యువతి కథ విని నేను షాకయ్యాను. ఆమె బిడ్డను చంపేయడానికి తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. ఆమె గర్భాన్ని కాపాడాలని నిర్ణయించుకున్నాం'' అని అభయం సంస్థ ప్రెసిడెంట్ ఆశా బెహన్ దలాల్ అన్నారు.
"గర్భవతి కావడంతో ఆ అమ్మాయిని ఇంటి నుంచి గెంటేశారు. ఆమె నా దగ్గరికి వచ్చిన తర్వాత, ఆమె కుటుంబం ఆమెను తమతో తీసుకెళ్లడానికి సిద్ధంగా లేకపోవడంతో, ఆమె ప్రసవానికి అన్ని చట్టపరమైన విధానాలను అనుసరించాల్సి వచ్చింది" అన్నారు ఆశా దలాల్.
"బిడ్డను కనాలని ఆ యువతి కోరుకుంది కాబట్టి అబార్షన్ సాధ్యం కాదు" అన్నారామె.
విపుల్ని పెళ్లి చేసుకోవాలనే సైరా సంకల్పం గురించి మాట్లాడుతూ "అబ్బాయి యుక్త వయస్కుడు కాదు. అమ్మాయి వివాహానికి అర్హురాలు. ఇది న్యాయపరమైన సమస్య" అన్నారామె.
''స్వచ్ఛందంగా బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధంగా ఉన్నానని, భవిష్యత్తులో ఏదైనా వివాదం తలెత్తితే బిడ్డ తండ్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోబోనని ఆ అమ్మాయి నుంచి రాత పూర్వకంగా హామీ తీసుకున్నాం.
"చట్టబద్ధమైన ప్రక్రియ కోసం పిల్లవాడిని అనాథాశ్రమానికి అప్పగిస్తాం. ఒక అమ్మాయి బాల్యంలో తప్పు చేసినా లేదా లైంగిక వేధింపులకు గురైనా, ఆమె దాని నుంచి బయటపడి కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు" అని ఆశా దలాల్ చెప్పారు.
బిడ్డను ఉంచిన అనాథాశ్రమానికి సంబంధించిన వివరాలను ఇవ్వడానికి ఆశాబెహన్ నిరాకరించారు. ప్రైవసీ కోసం ఆ ప్రదేశం పేరు చెప్పలేమని, ఆమె బిడ్డను కన్న ఆసుపత్రి కూడా తల్లి పేరును గోప్యంగా ఉంచిందని ఆమె అన్నారు.
''భర్త చనిపోతే ఆమె మళ్లీ పెళ్లి చేసుకోవచ్చు. కానీ భర్త ఉన్నారు. కానీ, అతను వివాహానికి అర్హుడు కాదు. చట్టబద్ధంగా ఆమెతో కలిసి ఉండటం కుదరదు. కాబట్టి, అమ్మాయి సంరక్షణ బాధ్యతను ఆమె తాతకు అప్పగించాం'' అన్నారు ఆశా దలాల్.
- 'ఇప్పుడే నీ చేతుల్లో చచ్చిపోయా'.. ప్రియాంక చోప్రా, నిక్ జోనస్ విడాకులపై రూమర్లకు ఈ కామెంట్ సమాధానమా?
- చరిత్ర: హానీమూన్ ఎప్పుడు, ఎందుకు మొదలైంది? దానికి ఆ పేరు ఎలా వచ్చింది?
'కలిసే ఉంటాం’
విపుల్ కూడా కుటుంబానికి వ్యతిరేకంగా సైరాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు.
''మేం ఇద్దరం గుడిలో పెళ్లి చేసుకున్నాం. వివాహాం తర్వాత సైరా ముస్లింగా ఉండి పోయింది. నేను హిందువుగానే ఉన్నాను'' అని బీబీసీతో అన్నారు విపుల్.
"అప్పట్లో సైరా ప్రెగ్నెంట్ కాబట్టి లాయర్ని సంప్రదించాను. ప్రస్తుతానికి మేం ఒకరినొకరు చూసుకోబోమని ఇరువురి ఇళ్లలో హామీ ఇచ్చాం" అన్నారు విపుల్.
"నాకు 21 ఏళ్లు రావడానికి ఇంకా అయిదు నెలల సమయం ఉంది. ఆ తర్వాత మేం మళ్లీ కలుసుకుంటాం. చైల్డ్ కేర్ సెంటర్ నుంచి మా బిడ్డను తీసుకొచ్చి కొత్త జీవితం ప్రారంభిస్తాం" అన్నారు విపుల్.
"విపుల్, సైరాల బిడ్డ చైల్డ్ కేర్ సెంటర్ నుంచి తిరిగి రావడం చట్టపరమైన విషయం. ఆ బిడ్డను వారి కస్టడీకి ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తాం'' అని విపుల్ తరఫు న్యాయవాది ఆశిష్ శుక్లా బీబీసీతో అన్నారు.
ఈ మొత్తం వ్యవహారం గురించి సామాజికవేత్త విద్యుత్ జోషి బీబీసీతో మాట్లాడారు.
''స్వతంత్రానికి ముందు అంటే రాజుల కాలంలోనే గుజరాత్లో హిందూ-ముస్లింల మధ్య వివాహాలు జరిగాయి" అన్నారు.
''ఈ మధ్య కాలంలో కులాంతర వివాహాలు ఆదరణ పొందుతున్న మాట వాస్తవమే. కానీ కొందరు వీటిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారు'' అని విద్యుత్ జోషి అన్నారు.
''ఈ వ్యవహారంలో భర్త మేజర్ అయ్యాక, ఆ దంపతులు తమ బిడ్డతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. వీరి జీవితం హిందూ-ముస్లింల వివాహానికి ఒక ఆదర్శంగా నిలుస్తుంది'' అని విద్యుత్ జోషీ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన 'ఆవు’
- NFTs : బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో పనిచేసే ఈ డిజిటల్ అసెట్స్ గురించి తెలుసా? - డిజిహబ్
- మోదీ ట్విటర్ ఖాతా హ్యాక్.. భారత్లో బిట్ కాయిన్కు అధికారిక ఆమోదం అంటూ ట్వీట్
- అఫ్గానిస్తాన్లో అమెరికా వైఫల్యానికి కారణం ఎవరు.. బుష్, ఒబామా, ట్రంప్ లేదా బైడెన్?
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- 'ఆవు పేడ చిప్’ను ఫోన్కు అతికిస్తే, రేడియేషన్ రాదా?
- ఈ ఆవు ఎత్తే దాని ప్రాణాలను కాపాడింది... ఎలాగో తెలుసా?
- గండికోట: సీమకు శిల కళ
- ధోనీ ఎవరికీ భయపడడు ఎందుకు?
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- బైజూస్: మెరుపు వేగంతో వృద్ధి వెనుక 'చీకటి నిజం’.. ఆందోళనలో కస్టమర్లు, ఉద్యోగులు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)