త్రిష,మణిరత్నంల అరెస్టుకు హిందూ సంఘాల డిమాండ్-మరో వివాదంలో పొన్నియిన్ సెల్వన్-అసలేం జరిగింది..
దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న భారీ చారిత్రాత్మక చిత్రం 'పొన్నియిన్ సెల్వన్'ను వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవల సినిమా చిత్రీకరణలో గుర్రం చనిపోవడంతో మణిరత్నంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా దర్శకుడు మణిరత్నం మరో వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనతో పాటు హీరోయిన్ త్రిషను అరెస్ట్ చేయాలని కొన్ని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ఓ ఆలయంలో జరగ్గా... కాళ్లకు చెప్పులు ధరించి త్రిష ఇందులో పాల్గొన్నారు. ఇది హిందూ దేవతలను అవమానించడమేనని హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఎందుకీ వివాదం...
ప్రస్తుతం మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా హరికేశ్వర్లో 'పొన్నియిన్ సెల్వన్' షూటింగ్ జరుగుతోంది. ఇక్కడ నర్మదా నది ఒడ్డున ఉన్న రాణి అఖిల్య బాయ్ కోట వద్ద ఉన్న శివాలయంలో చిత్రీకరణ జరుపుతున్నారు. నదిలో హీరోయిన్ త్రిష స్నానం చేసి... ఒడ్డునే ఉన్న శివాలయంలోకి వెళ్లే సన్నివేశాన్ని ఇటీవల చిత్రీకరించారు. దీనికి సంబంధించి లీకైన ఓ ఫోటోలో త్రిష తనకు కాళ్లకు చెప్పులతో కనిపించారు. పవిత్రమైన శివాలయంలో... శివ లింగాలు,నంది విగ్రహాలు ఉన్నచోట త్రిష చెప్పులతో నడవడమేంటని హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇదీ తమ ఆరాధ్య దైవాన్ని అవమానించడమేనని ఆరోపిస్తూ ఆ సంఘాలు హరికేశ్వర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిష,మణిరత్నంలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
Rashmi gautham: మోడరన్ డ్రెస్ లోనే కాదు, చీరలో కూడా అందాలు ఆరబోస్తున్న జబర్దస్త్ బ్యూటీ (ఫొటోస్)
హిందూ సంఘాలు ఏమంటున్నాయి...
పోలీసులకు ఫిర్యాదు చేసినవారిలో ఒకరైన దినేశ్ కట్టర్ అనే వ్యక్తి మాట్లాడుతూ... తాను హిందూ విద్యా మండల్ చీఫ్ అని తెలిపారు.'సినిమా షూటింగ్ నిమిత్తం హరికేశ్వర్కు వచ్చేవారికి మేము పలు విధాలుగా సాయం చేస్తుంటాం. అయితే షూటింగ్ పేరుతో ఇక్కడికి వచ్చేవారు హిందూ మతాన్ని అవమానపరుస్తున్నారు.ఇక్కడ రాణి అఖిల్య బాయ్ పాలనలో వెలిసిన శివలింగాన్ని అవమానపరిచేలా త్రిష వ్యవహరించారు. కాళ్లకు చెప్పులు ధరించి ఆమె శివలింగం వద్ద నుంచి నడుచుకుంటూ వెళ్లారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా,మా ఆరాధ్య దైవాన్ని అవమానించేలా వ్యవహరించిన దర్శకుడు మణిరత్నం,త్రిషలను అరెస్ట్ చేయాలి. లేదంటే మేము కోర్టును ఆశ్రయిస్తాం. ఇదే ఒకవేళ చర్చి లేదా మసీదు అయితే... వారు ఇలాగే చేస్తారా...?' అని ప్రశ్నించారు.
ఇటీవలే మణిరత్నంపై ఆ కేసు...
గతంలో హరికేశ్వర్లో సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 చిత్రీకరణలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. శివలింగం వద్ద చిత్ర యూనిట్ కుప్పలు తెప్పలుగా చెప్పులు విడిచారని కొంతమంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల పొన్నియిన్ సెల్వన్ చిత్రీకరణ సమయంలో గుర్రం చనిపోవడంతో మణిరత్నంపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో జరిగిన షూటింగ్ సందర్భం ఆ గుర్రం చనిపోయింది.ఈ సినిమాలో వచ్చే భారీ యుద్ధ సన్నివేశాన్ని ఇక్కడ చిత్రీకరించారు. ఇందుకోసం చిత్ర యూనిట్ నగరానికి చెంది 50 గుర్రాలను ఉపయోగించుకుంది. ఈ క్రమంలోనే గత నెల 11వ తేదీని ఓ గుర్రం డీహైడ్రేషన్ కారణంగా షూటింగ్ స్పాట్లోనే చనిపోయింది.విషయం పెటా ప్రతినిధులకు తెలియడంతో చిత్ర యూనిట్పై పోలీసులకు ఫిర్యాు చేశారు.మద్రాస్ టాకీస్ ప్రొడక్షన్ హౌజ్ మేనేజ్మెంట్, గుర్రం యజమానిపై సెక్షన్ 429, సెక్షన్ 11 పీసీఏ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
భారీ తారాగణంతో తెరకెక్కుతున్న చిత్రం..
పొన్నియిన్ సెల్వన్ చిత్రాన్ని భారీ తారాగణంతో భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. తొలి భాగాన్ని 2022లో విడుదల చేయనున్నారు. ప్రముఖ రచయిత కల్కి రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఐశ్వర్యరాయ్,విక్రమ్,జయం రవి,కీర్తి సురేశ్,మోహన్ బాబు,త్రిష, ఇలా అన్ని భాషలకు చెందిన నటీనటులతో సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా ఎస్ రవి వర్మన్ కెమెరామెన్గా వ్యవహరిస్తున్నారు.లైకా ప్రొడక్షన్స్, మద్రాస్ టాకీస్ బ్యానర్ పై మణిరత్నం, సుభాష్ కరణ్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
పొన్నియిన్ సెల్వన్ కథ...
'పొన్నియిన్ సెల్వన్' నవల. దాదాపు రెండువేల పేజీలకు పైగా ఉంది. పుదువెళ్ళమ్ (క్రొత్త వరద), సుళర్కాట్రు (సుడిగాలి ), కొలై వాళ్ (మృత్యు ఖడ్గం), మణి మకుడమ్ (మణి మకుటం), త్యాగ సిగరమ్ (త్యాగ శిఖరం) అన్న పేర్లతో అది ఐదు సంపుటాలుగా వచ్చింది. అనేక పాత్రలు, పల్లవ, పాండ్య, చోళ రాజ వంశాల వ్యక్తులు, వారి సంబంధాలు, శత్రుత్వాలు కలగలిసిన అద్భుతమైన చారిత్రిక నవలగా దీని గురించి చెబుతారు. పొన్నియిన్ సెల్వన్ మాత్రమే కాదు కల్కి కృష్ణమూర్తి రాసిన 'శివగామియిన్ సపదం' (శివగామి శపథం), 'పార్తిపన్ కనవు' (పార్థిపుని కల) నవలలు కూడా అద్భుత ప్రజాదరణ పొందాయి. ఆయన సాహిత్యంలో తమిళ రాజవంశాల గురించి, వారి వీర గాథల గురించి వర్ణించినట్లు చెబతారు. చరిత్రలో దొరికిన ఆధారాలు, జానపదుల పాటల్లోని కథలు, గాథలు, బోలెడన్ని కల్పనలు కలగలిసిపోయిన చారిత్రక కల్పనా సాహిత్యం ఆ నవలల్లో ఉందని అంటారు. ముఖ్య పాత్రలన్నీ చారిత్రక వ్యక్తులే అయినా చరిత్రలో కనిపించని ఎన్నో కథా పాత్రలు కూడా ఆ నవలల్లో కనిపిస్తాయని చెబుతారు. స్వాతంత్ర పోరాట సమయంలోనూ, స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలోనూ కల్కి రచనలు తమిళ ప్రజల్లో గొప్ప జాతీయ భావనను, పోరాట స్ఫూర్తిని నింపాయని చెబుతుంటారు.