‘తల్లిదండ్రులకు దూరం చేయాలని చూసినా విడాకులివ్వొచ్చు’
న్యూఢిల్లీ: విడాకుల అంశంపై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక తీర్పును వెల్లడించింది. ఈ తీర్పులో వివాహమయ్యాక భర్తను అతని తల్లిదండ్రుల నుంచి దూరం చేయాలని చూసే భార్యకు విడాకులు ఇవ్వొచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ చట్టం హిందువులకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది.
వివాహమయ్యాక భర్తతో మాత్రమే కలిసి ఉండాలని, సంపాదన తనకు మాత్రమే దక్కాలన్న స్వార్థంతో అతడిని తల్లిదండ్రుల నుంచి దూరం చేయకూడదని జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ ఎల్ నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
'కుటుంబాన్ని పోషిస్తున్న వ్యక్తికి వివాహమయ్యాక.. భార్య వేరే కాపురం పెట్టాలనుకోవడం చాలా తప్పు. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచి పెద్దచేసి చదివించినప్పుడు.. వివాహమయ్యాక కన్నవారిని పోషించడం వారి బాధ్యత. వృద్ధాప్యంలో వారి వద్ద డబ్బు ఉన్నా లేకపోయినా చూసుకోవాల్సిన బాధ్యత కుమారుడిపైనే ఉంటుంది' అని జస్టిస్ దవే తన తీర్పులో పేర్కొన్నారు.
అంతేగాక, వివాహమయ్యాక వేరే కాపురం పెట్టాలన్న ఆలోచన భారతీయ సంప్రదాయానికి విరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. విదేశీ సంస్కృతి.. ఇక్కడి పరిస్థితులకు సరిపోదని పేర్కొంది.