పెత్తనమా, హిందూదేశంగా ప్రకటించండి!: పరిపూర్ణానంద

హిందూ ఆలయాలను, వాటి ఆస్తుల నిర్వహణను హిందూ సమాజానికి అప్పగించాలని డిమాండ్ చేసింది. స్వామి దయానంద సరస్వతి ఆధ్వర్యంలో శనివారం బంజారాహిల్స్లో హిందూ ధర్మ ఆచార్య సభను నిర్వహించారు. ఈ సభ విషయాలను స్వామి పరిపూర్ణానంద విలేకరులకు తెలిపారు.
దేవాలయాల నిర్వహణ హిందూ సమాజానిదని, ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. ఒకవేళ దేవాలయాలను ప్రభుత్వమే నిర్వహించాలనుకుంటే దేశాన్ని హిందూదేశంగా ప్రకటించాలని, ఈ విషయమై తాము కేంద్రానికి లేఖ రాస్తామని పరిపూర్ణానంద స్వామి తెలిపారు.
ఆలయాలకు కార్యనిర్వాహక అధికారులను నియమించేటప్పుడు కేవలం ఐఏఎస్ అధికారులే ప్రామాణికం కాకుండా ధార్మిక చింతన, విలువలు కలిగిన వారిని ఎవరినైనా నియమించవచ్చునని చెప్పారు. దేవాలయాల నిర్వహణ, సమారాధలనలను హిందువులకే అప్పగించాలని డిమాండ్ చేశారు.
దేవాలయాల పైన దేవాదాయ శాఖ పెత్తనం ఉండరాదని గతంలో కూడా తాము కోర్టును ఆశ్రయించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దేవాలయాలనూ, వాటి ఆస్తులనూ ప్రభుత్వాలు హిందూ సమాజానికి గౌరవప్రదంగా అప్పగించాలని ఈ సభ అభిప్రాయపడినట్లు చెప్పారు.
ఒకవేళ భారత దేశం లౌకిక దేశంగా ఉండాలంటే ఇతర మతస్థులకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని హిందూ మతానికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేశారు. హిందూ పండుగలు వచ్చినప్పుడు నిత్యావసర వస్తువుల ధరలను పెంచి ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని, ఇతర వర్గాలకు మాత్రం అనేక సందర్భాలలో రాయితీలు ఇస్తోందని విమర్శించారు. హిందూ దేవాలయాలను ఆదాయవనరుగా భావిస్తున్నారని ఆరోపించారు.
ఆ రాయితీలను హిందువుల పండుగల సమయంలో కూడా వర్తింప చేసే విధంగా కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. ఆలయాలకు దాతలు ఇచ్చిన భూములను పంచే అధికారం ప్రభుత్వాలకు ఏమాత్రం లేదన్నారు. కాగా, సభకు మాజీ డీజీపీ అరవింద రావు, న్యాయవాది వెంకటరమణ, పరిపూర్ణానంద స్వామి తదితరులు హాజరయ్యారు.












Click it and Unblock the Notifications