లిఫ్టు ఇస్తామని చెప్పి.. టెక్కీని చితకబాది, దోచుకున్నారు
పుణె: లిఫ్టు ఇస్తామని కారులో తీసుకెళ్లిన దుండగులు.. ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ను చితకబాదారు. ఆ తర్వాత అతని వద్ద ఉన్న రూ. 25వేలను తీసుకుని నడిరోడ్డుపై వదిలేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటు చేసుకుంది. ఈ రకంగా దోపిడీ జరగడం గత 45రోజుల్లో ఇది మూడోది కావడం గమనార్హం.
ప్రధానంగా హింజెవాడి ఐటి పార్కు, దాని పరిసరాల్లో పని చేస్తున్న ఐటి ఉద్యోగులను దోపిడీ దొంగలు లక్ష్యంగా చేసుకుని, వాళ్ల మీద దాడి చేస్తున్నారు. ఈ ప్రాంతమంతా చీకటిగా ఉండటం, అక్కడి వాళ్లు రాత్రి పొద్దుపోయే వరకు పని చేసి తిరిగి వెళ్లడం లాంటి పరిస్థితులు వాళ్లకు అనుకూలంగా ఉంటున్నాయి.
తాజా ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. అమోల్ అనంత్ హతీమ్(25) అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ మంగళవారం రాత్రి 8.15గంటల సమయంలో తన విధులు ముగించుకుని, ఆఫీసు బయటికి వచ్చేశాడు. సాధారణంగా రోజూ అతడు పుణె మెట్రోపాలిటన్ బస్సుల్లో ఇంటికి వెళ్తాడు. కానీ, ఆ రోజు అరగంటపాటు బస్సురాలేదు. అప్పుడు ఓ కారు వచ్చింది.
డాంగే చౌక్ వరకు తీసుకెళ్తానని కారు డ్రైవర్ చెప్పడంతో హతీమ్ ఆ కారులో ఎక్కాడు. అప్పటికే ఆ కారులో నలుగురు ఉన్నారు. కాగా, కారు భుంకార్ మార్గంలో వెళ్లాల్సి ఉండగా, డ్రైవరు మరో మార్గంలో తీసుకెళ్తుండటంతో హతీమ్కు అనుమానం వచ్చింది. దీంతో అతడు కారు ఆపమని చెప్పాడు. అయితే డ్రైవర్ మరింత వేగం పెంచి కారును ముందుకు తీసుకెళ్లాడు.
ఉన్నట్టుండి ఒక్కసారిగా కారులోని వ్యక్తులు హతీమ్పై దాడి చేయడం ప్రారంభించారు. ఏటిఎం కార్డ్ పిన్ నెంబర్ చెప్పమని బలవంతపెట్టారు. మొదట తప్పు చెప్పినా.. చంపుతామని బెదిరించడంతో సరైన పిన్ నెంబర్ చెప్పాడు. దీంతో వాళ్లు ఏటిఎం సెంటర్ వద్దకు వెళ్లి రూ. 25వేలు డ్రా చేసుకున్నారు.
ఆ తర్వాత అతడ్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యారు. అక్కడ్నుంచి ఎలాగోలా పోలీస్ స్టేషన్ చేరుకున్న బాధితుడు హతీమ్.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాప్తు చేస్తున్నారు.