రాంపాల్ లొంగిపోవాల్సిందే: డిజిపి, మృతులు వీరే
బార్వాలా (హర్యానా): వివాదాస్పాద స్వామీజి రాంపాల్ లొంగుబాటుకు పోలీసుల వైపు నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఆయనపై దేశద్రోహం కేసుతో పాటు ఇతర తీవ్రమైన కేసులు కూడా నమోదు చేశారు. పలువురు అనుచరులపై కూడా పోలీసులు ఆ కేసులు నమోదు చేశారు. మంగళవారంనాడు సాయుధ ఘర్షణలు చోటు చేసుకున్న నేపథ్యంలో రాంపాల్తో సంప్రదింపులు జరిపే ప్రసక్తి లేదని పోలీసులు అధికారులు స్పష్టం చేస్తున్నారు.
పంజాబ్, హర్యానా హైకోర్టు ముందు శుక్రవారంనాడు హాజరు పరచడానికి రాంపాల్ను అరెస్టు చేసే వరకు తమ ఆపరేషన్ కొనసాగుతుందని హర్యానా పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) ఎస్ఎన్ విశిష్ట్ చెప్పారు. ఆశ్రమ వర్గాలు తమకు నలుగురు మహిళల శవాలను, ఇద్దరు రోగులను అప్పగించినట్లు ఆయన తెలిపారు. వారిలో ఓ శిశువు కూడా ఉన్నట్లు తెలిపారు. ఈ శిశువు ఆ తర్వాత ఆస్పత్రిలో మరణించింది. శిశువు మృతి గల కారణాలపై విచారణ జరపనున్నారు.
సంప్రదింపులకు అవకాశాలు లేవని, అటువంటి ప్రణాళిక కూడా లేదని, అతను తీవ్రమైన కేసుల్లో నిందితుడని, చట్టం ముందు లొంగిపోవాలని అతనికి తాను సలహా ఇస్తున్నానని డిజిపి బుధవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
పదివేల మంది రాంపాల్ అనుచరులు అశ్రమం నుంచి బయటకు వచ్చారని, మరో ఐదు వేల మంది లోపల ఉండవచ్చునని డిజిపి అన్నారు. తాము 270 మంది రాంపాల్ అనుచరులను అరెస్టు చేశామని, వారిలో 20 మంది కీలకమైన అనుచరులు ఉన్నారని, 250 మంది రాంపాల్ వ్యక్తిగత సైన్యమని ఆయన చెప్పారు.
సత్లోక్ ఆశ్రమం నుంచి మరింత మంది బయటకు రావడానికి మంగళవారం రాత్రి తాత్కాలికంగా ఆపరేషన్ ఆపేశామని చెప్పారు. రాంపాల్ అనుచరుల్లో ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నట్లు తెలిపారు. అమాయకుల ప్రాణాలను కాపాడడానికి తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. అందువల్ల తాము ఆపరేషన్కు గడువు పెట్టలేదని, తమకు అత్యంత ప్రధానమైంది అమాయకుల ప్రాణాలను కాపాడడమేనని అన్నారు.
మృతులు వీరే..
ఆశ్రమం సిబ్బంది పోలీసులకు నలుగురు మహిళల శవాలను అప్పగించారు. మృతులను ఢిల్లీకి చెందిన సవిత (31), రోహతక్కు చెందిన సంతోష్ (45), బిజ్నోర్కు చెందిన రాజ్ బాల (70), పంజాబ్లోని సంగ్రూర్కు చంెదిన మాలికిత్ కౌర్ (50)లుగా గుర్తించారు.
దానికి తోడు హృద్రోగంతో బాధపడుతున్న 20 ఏల్ల రజనిని బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు హుటాహుటిన హిసార్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆమె మరణించింది. పచ్చ కామెర్లతో బాధపడుతున్న ఏడాదిన్నర శిశువు కూడా ఆ తర్వాత మరణించింది. శిశువు తండ్రి విపిన్ ప్రతాప్ సింగ్. ఆ శిశువు మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాకు చెందింది.