వెరైటీ నిరసన: రైల్వే స్టేషన్ బయట ప్రయాణీకులకు ఫ్రీ హగ్స్
కోల్కత్తా: మెట్రో రైల్లో ఇద్దరు దంపతులు కౌగిలించుకొన్నందుకు తోటి ప్రయాణీకులు చితకబాదినందుకు నిరసనగా స్టేషన్ బయట ఫ్రీ హగ్స్ పేరిట ప్రయాణీకులను ఆలింగనం చేసుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని మెట్రో రైలులో ఇద్దరు దంపతులు మెట్రో రైలులో ప్రయాణీస్తుండగా కౌగిలించుకొన్నారు. దీంతో తోటీ ప్రయాణీకులు రైలులోనే వారిపై దాడి చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కౌగిలించుకొన్నందుకు దాడి చేస్తారా అంటూ యువత నిరసన కార్యక్రమాలకు పూనుకొన్నారు.
కోల్కత్తాలోని దమ్ దమ్ మెట్రో స్టేషన్ బయట ఫ్రీ హగ్స్ పేరిట ప్రయాణీకులను ఆలింగనం చేసుకొని యువత తమ నిరసనను వ్యక్తం చేశారు. మెట్రోలో కౌగిలించుకున్నారని దంపతులపై దాడి చేసిన వారిపై నిరసన తెలియజేస్తూ ఈ విధంగా విన్నూత నిరసన చేపట్టారు.
కౌగిలింత అనేది తప్పేంకాదని అది ప్రేమానుబంధాలకు ప్రతీక అని నిరసన చేస్తున్న యువత అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కూడా దాడి చేసిన వారిపై తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు నెటిజన్లు. ఫ్రీ హగ్ హ్యాష్ ట్యాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.