పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తాం - అమిత్ షా క్లారిటీ : ఎప్పటి నుంచి అంటే..!!
పౌరసత్వ సవరణ చట్టం అమలు పైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టత ఇచ్చారు. బెంగాల్ పర్యటనలో భాగంగా ఆయన సిలిగురిలో జరిగిన పశ్చిమ్ బంగో సమ్మాన్ సమావేశ్లో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం అమల్లోకి రాబోదని పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ వదంతులను ప్రచారం చేస్తోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మండిపడ్డారు. ఆయన రెండు రోజులపాటు రాష్ట్రంలో పర్యటిస్తారు. కోవిడ్-19 మహమ్మారి ప్రభంజనం ముగిసిన తక్షణం ఈ చట్టాన్ని కచ్చితంగా అమలు చేస్తామని చెప్పారు.
పౌరసత్వ సవరణ చట్టం అమలు భవిష్యత్ లో ఖచ్చితంగా ఉంటుందని స్పష్టం చేసారు. బెంగాల్కు వచ్చిన శరణార్థులు పౌరసత్వం పొందకూడదని మమత కోరుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలం పెరిగినందుకు హర్షం వ్యక్తం చేశారు. శాసన సభలో బీజేపీ బలం ముగ్గురి నుంచి 77 మందికి చేరడానికి అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. అంతకు ముందు మమతా బెనర్జీ కేంద్ర హోం మంత్రి పైన విమర్శలు చేసారు. అమిత్ షా ఢిల్లీలోని జహంగీర్పురి, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్లలో ఏం జరుగుతోందో చూడాలన్నారు.

అంతేకానీ పశ్చిమ బెంగాల్ గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. విభజనను సృష్టించడమే బీజేపీ పని అన్నారు. హోం మంత్రిగా ఆయన ఏం సాధించారని ప్రశ్నించారు. ఈద్ రోజు కూడా హింసకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. సీఏఏ బిల్లుకు కాల దోషం పట్టిందని వ్యాఖ్యానించారు. ఆ బిల్లును ప్రభుత్వం పార్లమెంటుకు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. ప్రజల హక్కులు అణచివేతకు గురికావాలని తాను కోరుకోవడం లేదన్నారు.
రాజకీయాల్లోకి బీఎస్ఎఫ్ను చొప్పించడం కోసం అమిత్ షా రాష్ట్రానికి వచ్చారని ఆరోపించారు. తాను ఎలా నడుచుకోవాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదని షా కు సూచించారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే పనులు చేయవద్దని.. నిప్పుతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. ప్రతిపక్షాలు సమైక్యంగా ఉంటాయని ఆశిస్తున్నట్లు పేర్కొన్న మమతా.. శక్తిమంతంగా, ధైర్యంగా యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications