ఊరుకోం: మంత్రి, తమిళనాట బాబు పటాన్ని చెప్పులతో కొట్టారు
ఏలూరు: జాతి సంపద అయిన ఎర్ర చందనం ను స్మగర్లు దోచేస్తుంటే చూస్తూ ఉరుకోబోమని, ఆదాయాన్ని ఏపీ అభివృద్ధికి వినియోగిస్తామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప మంగళవారం అన్నారు. చిత్తూరు జిల్లాలోని శేషాచలం అడవుల్లో జరిగిన ఎన్ కౌంటర్ పైన ఆయన స్పందించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎర్ర చందనాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని చెప్పారు. దీని ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారన్నారు. అలాంటి సంపదను దోచేస్తున్న స్మగర్ల ఆగడాలను అరికట్టేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటామన్నారు.
కాగా, శేషాచలం అడవుల్లోని ఎన్కౌంటర్లో మృతి చెందిన ఇరవై మందిలో కూలీలు, అందులోను తమిళనాడుకు చెందిన వారు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడ తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో తమిళ పత్రికల్లో మృతులతో కూడిన ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం భావించినట్లుగా మంగళవారం నాడు వార్తలు వచ్చాయి.
శేషాచలం ఎన్కౌంటర్పై తమిళనాడులో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఎదురు కాల్పుల విషయంలో అనుమానాలున్నాయని పలువురు నేతలు మండిపడ్డారు. తమిళుల మరణాన్ని తమిళ సంఘాలు తీవ్రంగా నిరసించాయి. తమిళగ వాల్ ఉరుమై కట్చి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి.
ఆ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎమ్మెల్యే వేల్ మురుగన్ నేతృత్వంలోని 150 మంది కార్యకర్తలు కడలూరు జిల్లా నైవేలిలోని ఎన్ఎల్సీ కర్మాగారాన్ని ముట్టడించేందుకు యత్నించగా.. పోలీసులు వారందరినీ అరెస్టు చేశారు. స్థానిక టి.నగర్లోని ఆంధ్రా సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా)ను ముట్టడించేందుకు తమిళగ వాల్ ఉరుమై కట్చికి చెందిన 100 మంది కార్యకర్తలు యత్నించారు.
పోలీసులు ఆస్కా చుట్టూ మోహరించి ఆందోళనకారులను అడ్డుకున్నారు. ఈ ఆందోళన సందర్భంగా ఆ కార్యకర్తలు ఏపీ సీఎం చంద్రబాబు చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ దగ్ధం చేశారు. ఏపీకి, ఏపీ పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆంధ్రా బ్యాంక్ కార్యాలయాలకు కూడా పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు.
తమిళగ మున్నేట్ర కజగం కార్యకర్తలు కోయంబేడు బస్టాండులో ఉన్న ఏపీఎస్ఆర్టీసికి చెందిన బస్సులపై రాళ్లు రువ్వగా పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. సరిహద్దు ప్రాంతంలో ఆందోళనకారులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులపై దాడులకు తెగబడుతున్నట్లు తెలియడంతో 35 సర్వీసులతో పాటు వేలూరు నుంచి సర్వీసులను కూడా రద్దు చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తడ వద్ద ఓ ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని ఆరుగురు వ్యక్తులు మంగళవారం సాయంత్రం పెట్రోలు బాంబులు, కత్తులతో దాడులకు దిగారు. పోలీస్ పెట్రోలింగ్ జీపు సైరన్ విని పరారయ్యారు. మరోవైపు, ముఖ్యమంత్రి పన్నీర్సెల్వం ప్రభుత్వ ఉన్నతాధికారులతో సచివాలయంలో అత్యవసరంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా ఎలాంటి ఆందోళనలు, దాడులు జరుగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం ఆదేశించారు.