తప్పని తేలితే రాజకీయాలు వదిలేస్తా: రాజ్నాథ్ సింగ్
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ప్రధాని కార్యాలయం కొట్టి పారేసింది. రాజ్నాథ్ సింగ్ కుమారునిపై వస్తున్న ఆరోపణలు అర్దరహితమని, కేవలం అబద్దాలు మాత్రమేనని పేర్కోంది. ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేందుకే ఇలాంటి అపోహలు సృష్టిస్తున్నారని ప్రధాని కార్యాలయం ప్రకటనలో పేర్కొంది.
ఇది ఇలా ఉంటే గత కొన్నిరోజులుగా తనపై, తన కుటుంబంపై కావాలనే కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ రోజు మీడియా సమావేశంలో చెప్పారు. రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ తాను కానీ, తన కుటుంబం కానీ తప్పు చేసినట్లు ఆధారాలు చూపిన మరుక్షణమే తన పదవీ బాధ్యతల నుండి తప్పుకుంటానని అన్నారు.
ప్రస్తుతం తన కుటుంబం, తనపై వచ్చిన పుకార్ల గురించిపార్టీ పార్టీ అధ్యక్షడు అమిత్ షా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీగా స్వయంగా వివరించానని అన్నారు. ఆ ఆరోపణలు విన్న వెంటనే వారు ఒకింత ఆశ్చర్యానికి గురైనట్లు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
ఉత్తరప్రదేశ్ ఉప ఎన్నికల్లో నోయిడా స్దానం నుండి రాజ్నాథ్ సింగ్ కుమారుడికి పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో రాజ్నాథ్ సింగ్ అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వచ్చాయి. పార్టీ టిక్కెట్ నిరాకరించడానికి కారణం రాజ్నాథ్ సింగ్ తనయుడి ప్రవర్తన సరిగ్గా లేకపోవడం, కుటుంబం అవినీతి గురించి మీడియాలో వార్తలు రావడం భావిస్తున్నారు. రాజ్నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, కేవలం రాజకీయ దురుద్దేశంతోనే చేసినట్లు ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
రాజ్నాథ్ సింగ్ మచ్చలేని మంచి వ్యక్తి: శరద్ యాదవ్
కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను జేడీయూ ప్రెసిడెంట్ శరద్ యాదవ్ సమర్దించారు. రాజ్నాథ్ సింగ్ మచ్చలేని మంచి వ్యక్తి అంటూ కొనియాడారు. రాజ్నాథ్ సింగ్ కుటుంబంపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి శరద్ యాదవ్ అన్నారు.