హైదరాబాద్ పెద్ద సవాల్: జివోఎంకు హోంశాఖ నోట్
హైదరాబాద్: రాష్ట్ర విభనకు అతి పెద్ద సవాల్ హైదరాబాదే అతి పెద్ద ఆటంకంగా గుర్తించిన కేంద్ర హోం శాఖ జీవోఎంకు 85 పేజీల నోట్ను అందజేసింది. ఈ నోట్కు సంబంధించిన వివరాలను సోమవారం సాయంత్రం తెలుగు టీవీ న్యూస్ చానెళ్లు ప్రసారం చేశాయి. ఐదు కీలకమైన అంశాలను పరిష్కరిస్తే రాష్ట్ర విభజన సులభమవుతుందని హోం శాఖ గుర్తించినట్లు అర్థమవుతోంది.
నివేదికలో విభజన సమస్యలుగా ఉన్న నీళ్లు, నిధులు, విద్యుత్, హైదరాబాద్ స్థితి, శాంతి భద్రతలు, ఆర్టికల్ 371 (డి) అంశాలు తదితర వాటిపై పరిశీలించి తగిన సమాచారం ఆధారంగా బిల్లును రూపొందించాలని జీవోఎంకు హోంశాఖ సూచించినట్లు న్యూస్ చానెళ్ల వార్తాకథనాల సారాంశం. అవసరమైతే 371 (డి) ఆర్టికల్ను సవరణ చేయవచ్చునని తెలిపింది.

సవరణకు సంబంధించిన అంశాలను నివేదికలో హోంశాఖ నోట్లో ప్రస్తావించింది. రాష్ట్రంలో జోనల్ వ్యవస్థకు అవకాశం కల్పించే ఆర్టికల్ అది. రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల్లోనూ ఆ వ్యవస్థను కొనసాగించాలంటే దానికి సవరణ చేయాల్సి ఉంటుంది. లేదంటే, ఉపసంహరించుకోవచ్చు. ఆర్టికల్ 371(డి)ని సవరించే ప్రక్రియను విభజన బిల్లును ప్రతిపాదించడానికి ముందు చేయవచ్చు లేదా విభజన బిల్లులో భాగంగా దాన్ని సవరించవచ్చు.
మూడు ప్రాంతాల వారికి హైదరాబాద్లోనే విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించే అంశపై చూడాలని, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లల్ని చదువుల కోసం, ఉద్యోగాల కోసం హైదరాబాద్కే పంపుతున్నారని అంచేత వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నివేదిక అందజేయాలని హోంశాఖ జీవోఎంకు సూచించింది. హైదరాబాద్లో, దాని చుట్టూ ఉన్న సంస్థలను దృష్టిలో పెట్టుకోవాలని సూచించింది.

రాష్ట్రానికి హైదరాబాద్ నుంచే అధిక రెవెన్యూ వస్తోందని, ఎందుకంటే 40 కేంద్ర ప్రభుత్వ సంస్థలు, 28 రక్షణ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ ఆస్పత్రులు, ప్రధాన యూనివర్శిటీలు హైదరాబాద్లోనే ఉన్నాయని నివేదికలో హోంశాఖ పేర్కొంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్పై తగిన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంశాఖ జీవోఎంకు సూచించింది.
కాగా, శాసనసభ డిప్యూటీ స్పీకర్ మల్లుభట్టి విక్రమార్కను ఆంధ్రప్రాంతానికి చెందిన నాయకుడిగా నోట్లో పేర్కోన్నట్లు సమాచారం. విభజన సమయంలో డిప్యూటీ స్పీకర్గా తెలంగాణ నాయకుడిని నియమించాల్సి ఉంటుందని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాకు చెందినవారు. పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిడబ్ల్యుసి తీసుకున్న నిర్ణయం మేరకే బిల్లు రూపొందే అవకాశాలున్నందున ఖమ్మం జిల్లా కూడా తెలంగాణ ప్రాంతంలోకే వస్తుంది.

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని వెనకబడిన జిల్లాల జాబితాను, నక్సల్స్ ప్రభావిత జిల్లాలను కూడా నోట్లో కేంద్ర హోంశాఖ ప్రస్తావించింది. ఈ జిల్లాలకు అందించాల్సిన ప్యాకేజీలకు కూడా సూచనలు చేయాలని సూచించింది. ఇందులో తెలంగాణకు చెందిన జిల్లాలే కాకుండా సీమాంధ్ర జిల్లాలు కూడా ఉన్నాయి. నదీ జలాల పంపిణీకి వాటర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications