పరువు హత్య: ముస్లిం అమ్మాయిని ప్రేమించినందుకు దళిత వ్యక్తిని కొట్టి చంపారు
రాజస్థాన్ : ముస్లిం మహిళతో సత్సంబంధాలు నెరుపుతున్నారన్న ఆరోపణలపై ఓ దళిత యువకుడిని కొట్టి చంపిన ఘటన రాజస్థాన్లోని బార్మర్లో వెలుగుచూసింది. మెహబూబ్ ఖాన్ అనే వ్యక్తి ఇంట్లో ఖేత్రాం భీమ్ అనే 22 ఏళ్ల యువకుడు పనిచేసేవాడు. మెహబూబ్ ఖాన్ కుటుంబంలో ఉండే మరో యువతితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న పెద్దలు ఖేత్రాంను హెచ్చరించారు. ఇకపై జాగ్రత్తగా మసులుకోవాలంటూ వార్నింగ్ ఇచ్చారు. అయినా ఇవేమీ పట్టించుకోలేదు ఖేత్రాం. ఎప్పటిలాగే ఇద్దరూ మాట్లాడుకుంటూ ప్రేమించుకుంటూనే ఉన్నారు.
ఒకసారి ఇద్దరు కలిసి తిరగడం చూసిన కుటుంబ సభ్యులు మరోసారి ఖేత్రాం కు సీరియస్గా వార్నింగ్ ఇచ్చారు. అయితే అమ్మాయి కుటుంబ సభ్యుల్లో ఒకరికి మాత్రం ఖేత్రాంను చంపేయాలన్న ఆలోచన తట్టింది.ఇందుకు పథకం రచించారు. సదాం ఖాన్, హయత్ ఖాన్ అనే ఇద్దరు వ్యక్తులు ఖేత్రాంను తమ పొలంలో కలవాల్సిందిగా పిలిచారు. వీరి మాటలు నమ్మి కలిసేందుకు పొలానికి వెళ్లాడు ఖేత్రాం. అప్పటికే ఏడు మంది మాటు వేసి ఉన్నారు. ఖేత్రాం పొలానికి చేరుకోగానే అతనిని పట్టుకుని చెట్టుకు కట్టేశారు. చనిపోయే వరకు చితకబాదారు. చనిపోయాడని నిర్ధారించుకున్న దుండగులు ఖేత్రాం మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. మూడు రోజుల తర్వాత ఆయన మృతదేహం బయటపడింది.
మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు ఖేత్రాంను కొట్టి చంపారని తెలిపారు. అంతేకాదు గొంతును కూడా నులిమిన గుర్తులు ఉన్నాయని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటివరకు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేసి దాడిలో పాల్గొన్న ఇతరుల వివరాలను కూడా రాబట్టే పనిలో ఉన్నారు. దేశంలో జరుగుతున్న సామూహిక దాడుల నేపథ్యంలో ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. అంతకుముందు ఇదే రాష్ట్రంలో ఓ వ్యక్తి గోవులను స్మగ్లింగ్ చేస్తున్నాడంటు కొంతమంది అతనిపై దాడి చేసి హత్యచేశారు.