8ఏళ్ల పగ: కోడలి గొంతుకోసి హత్య, దోపిడీగా చిత్రీకరణ
కోయంబత్తూరు: తమిళనాడు రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించకపోయినా.. వారు పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ విద్యావంతులే కావడంతో వారి కాపురం సజావుగానే సాగింది. ఇంతలో ఉద్యోగం రావడంతో తన భార్యను తన తల్లిదండ్రుల వద్ద ఉంచి వెళ్లాడు ఆ యువకుడు. కొన్ని రోజుల తర్వాత ఆమెను కూడా తీసుకెళ్తానని చెప్పాడు.
కాగా, తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నాడని ఇన్నేళ్లుగా పగతో రగిలిపోయిన ఆ యువకుడి తల్లిదండ్రులు ఆమెను దారుణంగా గొంతుకోసి చంపేశారు. ఆ తర్వాత ఇదంతా దోపిడీ దొంగల పనిగా నమ్మబలికారు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది.
వివరాల్లోకి వెళితే.. ఎనిమిదేళ్ల క్రితం ఉన్నత చదువులు చదువుతున్న సమయంలో సంతోష్, సుమతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఎనిమిదేళ్లు వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగిపోయింది. సంతోష్ సుమతిని తొలిసారి కోయంబత్తూరులో కలిశాడు. అప్పుడు ఆమె పీజీ చదువుతోంది. కొంతకాలానికి వారి స్నేహం ప్రేమగా మారింది. కులాలు వేరైనా, తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా.. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
ఇద్దరు చదువుకున్న వారు కావడంతో ఎలాంటి మనస్పర్థలు లేకుండా వారి వైవాహిక జీవితం ముందుకుసాగింది. ఈ క్రమంలో సంతోష్కు ఇటీవలే ఓ బ్యాంకులో అసిస్టెంట్ మేనేజర్గా ఉద్యోగం లభించింది. దీంతో అతను తన సొంతూరు నమ్మక్కల్ నుంచి హోసూర్కు మకాం మార్చాడు. త్వరలోనే భార్య సుమతిని కూడా హోసూర్ కు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశాడు.
అయితే ఇంతలోనే ఇటు నమక్కల్లోని తన ఇంట్లో ఘోరం జరిగింది. సుమతి గొంతుకోసి దోపిడీ దొంగలు ఇంటిలో నుంచి బంగారం, నగలు ఎత్తుకుపోయారని సంతోష్ తల్లిదండ్రులు పళనివేల్, మాధేశ్వరిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ, పోలీసుల విచారణలో దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి.
కొడుకు కులాంతర వివాహాన్ని అంగీకరించి.. సుమతిని కోడలిగా ఒప్పుకున్నట్టు అతని తల్లిదండ్రులు పైకి నటించినప్పటికీ, వారు కడుపులో పగ దాచుకొని ఎనిమిదేళ్లు వేచి చూశారని, అదను రాగానే కోడలిపై దాడిచేసి ఆమె గొంతు కోసి చంపారు. దీనిని దోపిడీ దొంగలు కిరాతకంగా చిత్రించేందుకు ఆమె ఫోన్ను, నగలను వారే తీసి దాచిపెట్టి.. పోలీసులకు కట్టు కథలు చెప్పారు.
అయితే, పోలీసులకు అనుమానం వచ్చి తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడులో సంచలనం సృష్టించిన ఈ కేసులో మృతురాలు సుమతి అత్తమామలు పళనివేల్, మాధేశ్వరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై పరువు హత్య కేసు నమోదుచేసి, సేలం జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.