జేపీ ఊళ్లోనే పుట్టినందుకు గర్విస్తున్నా - రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ తొలి ప్రసంగం - సభ వాయిదా
జేపీగా సుప్రసిద్దులైన 'లోక్ నాయక్' జయప్రకాశ్ నారాయణ్ జన్మస్థలమైన సీతాబ్దియారాలోనే తానూ పుట్టానని, అందుకు ఎంతగానో గర్విస్తున్నానని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ సింగ్ అన్నారు. సోమవారం జరిగిన ఎన్నికలో యూపీఏ అభ్యర్థి మనోజ్ ఝాను ఓడంచి, డిప్యూటీ చైర్మన్ గా ఎన్నికైన హరివంశ్ ను.. చైర్మన్ వెంకయ్య నాయుడు సభాపతి స్థానంలోకి ఆహ్వానించారు. తన తొలి ప్రసంగంలో హరివంశ్.. లోక్ నాయక్ ను స్మరించుకున్నారు.
రాజ్యసభ: బీజేపీకి టీఆర్ఎస్ ఝలక్ -సంస్కృతం వద్దు- హిందీనే ముద్దు - కేశవరావు, సురేశ్ రెడ్డి ప్రమాణం
డిప్యూ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా తనను అభినందించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర పార్టీల నేతలకు హరివంశ్ సింగ్ ధన్యవాదాలు తెలిపారు. తనను ఉద్దేశించి ప్రధాని, ఇతర నేతలు చెప్పిన మాటలను నిత్యం గుర్తుంచుకుంటానని, పార్లమెంటరీ నిబంధనల ప్రకారమే రాజ్యసభను నిర్వహిస్తానని ఆయన పేర్కొన్నారు. కీలకమైన ఎయిర్ క్రాఫ్ట్(సవరణ) బిల్లు, ఆయుర్వేదిక్ ఇనిస్టిట్యూట్ బిల్లులకు రాజ్యసభ ఆమోదం లభించింది. మధ్యాహ్నం 1 గంటలకు కొలువైన రాజ్యసభలో కొత్త ఎంపీల ప్రమాణం, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ తర్వాత సభ మంగళవారానికి వాయిదా పడింది. అంతకుముందు..
కరోనా సాకుతో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేయడంపై రాజ్యసభలోనూ ప్రతిపక్ష పార్టీలు నిరసనకు దిగాయి. ఇదే అంశంపై ఉదయం లోక్ సభలో విపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టగా, ప్రభుత్వం తరఫున రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. రాజ్యసభలో క్వశ్చన్ అవర్ రద్దును సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ సైతం మద్దతు తెలిపారు. అయితే, చర్చకు రాకముందే ఈ తీర్మానం వీగిపోవడం గమనార్హం.
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా హరివంశ్ సింగ్ - ఆర్జేడీ అభ్యర్థిపై విజయం - ప్రధాని సహా పలువురి అభినందన
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలిరోజైన సోమవారం తొలుత లోక్ సభ, ఆ తర్వాత రాజ్యసభ కొలువుదీరాయి. మంగళవారం నుంచి మాత్రం ఉదయం పూట రాజ్యసభ, మధ్యాహ్నం తర్వాత లోక్ సభ సమావేశం కానున్నాయి. కరోనా నేపథ్యంలో టెస్టులు తప్పనిసరి చేయడంతో ఉభయ సభలు కలిపి మొత్తం 25 మంది ఎంపీలు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యారు. చరిత్రలో తొలిసారి కూర్చొని మాట్లాడే పద్ధతిని అనుసరిస్తున్నారు.