భారీగా పెట్రో బాదుడు, గంటల్లోనే పెరిగిన ఎల్పీజీ ధర
న్యూఢిల్లీ: పెట్రోలు, సబ్సిడీయేతర ఎల్పీజీ ధరలు పెరిగాయి. పెట్రోల్ పై లీటరుకు రూ.2.58, డీజిల్ ధర రూ.2.26 పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు మంగళవారం అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి.
ఇంధన ధరలపై నియంత్రణను ప్రభుత్వం ఎత్తివేశాక అంతర్జాతీయ చమురు మార్కెట్ స్థితిగతులు, డాలర్తో రూపాయి మారకం విలువల ఆధారంగా ప్రతి రెండు వారాలకు ఓసారి ఇంధన ధరలపై ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తుంటాయి.
ఈ క్రమంలో పదిహేను రోజుల క్రితం పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా మంగళవారం ఆయిల్ కంపెనీలు మరోసారి ధరలు బాదాయి. ఆయిల్ కంపెనీలు పెంచిన ధరలు స్థానిక పన్నులతో కలుపుకుని ప్రస్తుతం హైదరాబాదులో లీటర్ పెట్రోల్ రూ.2.72 పెరిగి రూ.69.89 కి చేరింది. అదే సమయంలో లీటర్ డీజిల్ ధర రూ.2.48 పెరిగి రూ. 58.74కు చేరింది.
సబ్సిడీయేతర ఎల్పీజీ గ్యాస్ ధర పెంపు
సబ్సిడీయేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.21, విమాన ఇంధనం ధర 9.2శాతం పెంచుతూ చమురు సంస్థలు బుధవారం నిర్ణయం తీసుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో వరసగా నాలుగో నెలా ధరలు పెరిగాయి. పెట్రోలు ధర పెరిగిన కొద్ది గంటల్లోనే ఎల్పీజీ ధర పెరిగింది.
సబ్సిడీయేతర ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.21 పెరిగింది. దీంతో ఢిల్లీలో 14.2 కేజీల సిలిండర్ ధర ఇప్పటి వరకు రూ.527.50గా ఉండగా పెంపుతో అది రూ.548.50 అవుతుంది. ఈ ధరలు బుధవారం నుంచి అమల్లోకి వస్తున్నాయి. రాష్ట్రాల వ్యాట్ల ఆధారంగా ఈ ధర రాష్ట్రాల వారీగా వేరు వేరుగా ఉంటుంది.
విమానం ఇంధనం ధర 9.2 శాతం పెరగడంతో ఢిల్లీలో దాని ధర కిలో లీటరు రూ.46,729.48కి చేరింది. ఎయిర్పోర్టులు ఉన్న ప్రాంతాల్ని బట్టి రాష్ట్రాల్లో దీనిపై వ్యాట్ వేరు వేరుగా ఉంటుంది. దీంతో దేశంలో ప్రాంతాన్ని బట్టి ధర మారుతుంది. విమాన ఛార్జీలపైనా ఈ పెంపు ప్రభావం పడే అవకాశం ఉంది.