పరేడ్లోనే లవ్ ప్రపోజల్: ఇది ఆర్మీ మ్యాన్ లవ్ స్టోరీ, ఆనందంతో ప్రియుడి కౌగిలిలో వాలింది!
చెన్నై: ఏకంగా ఆర్మీ పరేడ్లోనే తన ప్రియురాలికి తన ప్రేమను వ్యక్తపరిచి సంభ్రమాశ్చర్యాలకు గురిచేశాడో జవాను. దీంతో ఎంతో ఆనందంగా అతని ప్రేమను అంగీకరించింది ప్రియురాలు. ఈ ఘటన తమిళనాడులోని చెన్నైలో చోటు చేసుకుంది. ఆ ప్రేమికుడే చెన్నైకి చెందిన ఆర్మీ అధికారి ఠాకూర్ చంద్రేశ్ సింగ్.
సాఫీగా సంసారం!: 'ఆదర్శ కోడలు' కోర్సు ప్రవేశపెట్టనున్న భోపాల్ వర్సిటీ, ఏం నేర్పిస్తారంటే?
ఆర్మీ ఆఫీసర్గా..
ఆ వారి ప్రేమ వివరాల్లోకెళితే.. 25 ఏళ్ల చంద్రేశ్ సింగ్ చెన్నైలోని ఆఫీసర్ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ పూర్తిచేశారు. రాజ్పుతానా రైఫిల్స్లో జవానుగా చేరారు.సెప్టెంబర్8న టిప్పింగ్ కార్యక్రమం (జవాన్లకు వారి తల్లిదండ్రులు నక్షత్ర గుర్తుతో ఉన్న బ్యాడ్జిలను పెట్టే వేడుక) నిర్వహించారు.
నన్ను పెళ్లి చేసుకుంటావా?
ఈ కార్యక్రమం నేపథ్యంలో నిర్వహించిన పరేడ్ అనంతరం చంద్రేశ్ అదే మైదానంలో తాను ప్రేమించిన ధారా మెహతా అనే యువతిని ‘నన్ను పెళ్లి చేసుకుంటావా' అని ప్రపోజ్ చేశారు. ఇందుకు ధారా మెహతా కూడా ఒప్పుకోవడంతో చంద్రేశ్ ఆనందానికి అవధుల్లేవు. అందరి ముందు తన ప్రేమను వ్యక్తపరచడంతో ధారా సిగ్గుపడుతూ చంద్రేశ్ను ఆలింగనం చేసుకున్నారు.
ముందే ఫిక్స్ అయిన చంద్రేశ్
ఇంకేముంది అక్కడి మీడియా వర్గాలు, ఇతర వ్యక్తులు వీరి ఫొటోలు తీసి సోషల్మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఇన్స్టాగ్రామ్లో వీరి ఫొటోలకు 34వేలకు పైగా లైక్లు వచ్చాయి. ఇంకా వస్తూనే ఉన్నాయి. ఆర్మీలో చేరడానికి ముందే తాను తన ప్రేయసికి ఇలా ప్రపోజ్ చేయాలనుకున్నానని చంద్రేశ్ మీడియా ద్వారా వెల్లడించారు.
పేరెంట్స్ కూడా ఓకే చెప్పేశారు.. ఎయిర్ హొస్టెస్గా ధార
తాను, ధారా మూడున్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని ఆమె ఫొటోను తన తల్లిదండ్రులకు కూడా చూపించానని చంద్రేశ్ వెల్లడించారు. ధారా ఫొటో చూశాక ‘నీకు ఈ అమ్మాయే కరెక్ట్' అని తన తల్లిదండ్రులు కూడా చెప్పారని ఆనందం వ్యక్తం చేశాడు. అయితే, ఆర్మీలో చేరాలన్న తన కల నెరవేరిన తర్వాతే ధారాను పెళ్లిచేసుకోవాలనుకున్నట్లు చెప్పారు. సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు పరీక్షల్లో ఒకసారి విఫలమయ్యానని, ఆ సమయంలో ధారానే తనను ప్రోత్సహించిందని చెప్పుకొచ్చారు చంద్రేశ్. కాగా, ధారా ప్రస్తుతం ఎయిర్హొస్టెస్గా విధులు నిర్వహిస్తోంది.