టార్గెట్ 2019: గ్రామీణ ఓటర్లే లక్ష్యం, అర్బన్ ఓటర్లపై జైట్లీ వల
న్యూఢిల్లీ: పేద, గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లను లక్ష్యంగా చేసుకొని కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో కేటాయింపులకు పూనుకొంది. ఈ ఏడాది 8 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి.ఈ రాష్ట్రాల్లో ఎన్నికల దృష్ట్యా గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం కేటాయింపులు ఎక్కువగా చేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికలను పురస్కరించుకొని బడ్జెట్ లో కేటాయింపులు చేసిందనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.గుజరాత్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన ఫలితాలు కూడ ఇదే రకమైన అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి.
గ్రామీణ ప్రాంతంలోని ఓటర్లు గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. పట్టణ ప్రాంతాలకు చెందిన ఓటర్లు బిజెపికి పట్టం కట్టారు. ఈ ఫలితాలతో పాటు రానున్న రోజుల్లో జరిగే ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని కేంద్రం ఈ మేరకు బడ్జెట్లో గ్రామీణ ప్రాంత రంగాలకు కేటాయింపులపై ఎక్కువగా శ్రద్ద పెట్టిందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.
ఓట్లు రాబట్టే బడ్జెట్
ఈ ఏడాది ఎనిమిది రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ రెండింటిని దృష్టిలో ఉంచుకొని కేంద్రం బడ్జెట్ రూపకల్పన చేసింది.పట్టణ ప్రాంత ఓటర్ల కంటే గ్రామీణ ప్రాంత ఓటర్లు బిజెపిపై కొంత అసంతృప్తిగా ఉన్నారని ఇటీవల గుజరాత్ రాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని గ్రామీణ ప్రాంత ప్రజలను సంతృప్తిపర్చేలా చర్యలు తీసుకొంది.మరో వైపు పట్టణ ప్రాంత ప్రజలను కూడ సంతృప్తి పర్చేలా మోడీ సర్కార్ వరాలు కురిపించింది.రెండింటిని సమన్వయం చేసేందుకు ప్రయత్నం చేసింది.
బడ్జెట్ ఎఫెక్ట్: మొబైల్స్, కార్ల ధరలు పైపైకి, తగ్గనున్న సోలార్ టెంపర్ గ్లాస్ ధరలు
ప్రజలను ఆకట్టుకొనేలా మెడికల్ ఇన్సూరెన్స్
గ్రామీణ ప్రాంత ప్రజలను ఆకట్టుకొనేలా మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్ను ఈ బడ్జెట్లో కేంద్రం ప్రవేశపెట్టింది. ఏటా రూ.330 చెల్లిస్తే ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి రూ.5 లక్షల వరకు మెడికల్ ఇన్సూరెన్స్ను ఇవ్వనున్నట్టు ప్రకటించింది. అధిక ఆదాయం ఉన్న పట్ణణ ప్రాంతాల ప్రజలు కూడ అధిక పన్ను చెల్లించి ఈ రకమైన ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పొందే అవకాశం కూడ కల్పించింది.
8 కోట్ల ఎల్పీజీ కొత్త కనెక్షన్లు
గ్రామీణ ప్రాంత మహిళలను లక్ష్యంగా చేసుకొని కొత్తగా ఈ ఏడాది 8 కోట్ల కొత్త ఎల్పీజీ గ్యాస్ కనెక్ష్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకొంది. ఈ నిర్ణయం ఆధారంగా గ్యాస్ కనెక్షన్లు లేని మహిళలకు కొత్తగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వనున్నారు. మరో వైపు పట్టణ ప్రాంతాల్లో వారు వినియోగించే మొబైల్స్, ల్యాప్టాప్, ఎల్ఈడీ టీవీల వంటి వాటి ధరలు పెరగనున్నాయి. కేంద్రం కస్టమ్స్ డ్యూటీ పెంచడం వల్ల వీటి ధరలు పెరిగే అవకాశం ఉంది.
వ్యవసాయానికి పెద్దపీట
వ్యవసాయానికి బడ్జెట్లో ఎక్కువ నిధులను కేటాయించింది ప్రభుత్వం. మద్దతు ధర కోసం పోరాటం చేస్తున్న రైతులకు బడ్జెట్ కేటాయింపులు కొంత ఆశలను రేకెత్తిస్తున్నాయి. బడ్జెట్ లో ప్రభుత్వం ప్రకటించిన నిధులు రానున్న ఖరీఫ్ లేదా, రబీ సీజన్ నాటికే రైతులకు అందే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.రైతులకు అధికంగా మద్దతు ధరలను ఇస్తే ధరలపై ఒత్తిడిని తగ్గించే అవకాశం లేకపోలేదంటున్నారు. తద్వారా ద్రవ్యోల్బణాన్ని కూడ అదుపు చేసే అవకాశం కూడ ఉంటుందని అంచనా. ఇది రాజకీయంగా బిజెపికి ప్రయోజనం కలిగే అవకాశం లేకపోలేదు.
గ్రామీణ ప్రాంతాలే టార్గెట్
గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయేతర ప్రజలను లక్ష్యంగా చేసుకొని ఈ బడ్జెట్లో ఎన్డీయే ప్రభుత్వం కేటాయింపులు చేసింది. ఈ కేటాయింపుల ఆధారంగా ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల్లో అసంతృప్తిని తగ్గించేందుకు ప్లాన్ చేసింది. మరోవైపు కర్ణాటక రాష్ట్రంలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.దీన్ని దృష్టిలో ఉంచుకొని రైల్వే ప్రాజెక్టును మంజూరు చేసింది.