రైలు పట్టాలపై పడుకుంటే చస్తారుగా.. వాళ్లనెవరూ ఆపలేరు.. వలస కూలీలపై సుప్రీంకోర్టు షాకింగ్ కామెంట్స్
''మాట వినేవాళ్లకైతే ఏదైనా చెబుతాం. వద్దన్నా వినకుండా రోడ్ల వెంట నడుచుకుంటూ సొంత ఊళ్లకు వెళ్లిపోతున్న వలస కూలీలకు ఏం చెప్పాలి? ఎవరు చెప్పాలి? చనిపోతారని తెలిసి కూడా రైలు పట్టాలపై నిద్రపోయేవాళ్లను ఎలా ఆపాలి? చాలా మంది ఇప్పటికే దారి మధ్యలో ఉన్నారు. వాళ్లను ఆపడం అసాధ్యం. అయినా.. ఏ కూలీ ఎక్కడున్నాడో కనిపెట్టి వాళ్లను క్షేమంగా ఇంటికి చేర్చాల్సిన పనిని కోర్టులు ఎందుకు తలెత్తుకోవాలి? ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి మేం ఎలాంటి సూచనలు చేయబోము.. ఆయా రాష్ట్రాలే బాధ్యత వహించాలి.. '' అంటూ భారత సర్వోన్నత న్యాయస్థానం అనూహ్య కామెంట్లు చేసింది.
Recommended Video
వలస కూలీలపై పిటిషన్ కొట్టివేత..
లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన కోట్లాది మంది వలస కూలీలు.. వివిధ రాష్ట్రాల నుంచి తమ సొంత ఊళ్లకు కాలిబాటన పయనమయ్యారు. చిన్నాపెద్దా తిండిలేక, కనీసం కాళ్లకు చెప్పులు కూడా లేక ఆపసోపాలు పడుతున్న దృశ్యాలు అందరిచేత కన్నీరు పెట్టిస్తున్నారు. రోడ్డు మీద వెళితే పోలీసులు అడ్డుకుంటారేమోననే భయంతో రైల్వే ట్రాక్ పై నడిచి, అలసిపోయి పట్టాలపై పడుకున్న కూలీలను గూడ్స్ రైలు చిదిమేసిన సంఘటన ఔరంగాబాద్ లో చోటుచేసుకుంది. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా, వలస కూలీల తరలింపుపై కేంద్రానికి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలంటూ ఢిల్లీకి చెందిన అలోక్ శ్రీవాస్తవ అనే లాయర్.. సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ విచారణకు అర్హంకాదంటూ కోర్టు దానిని కొట్టేసింది. విచారణ సందర్భంగా..
ఏర్పాట్లు చేసినా వాళ్లంతే..
వలస కూలీలను సురక్షితంగా ఇళ్లకు చేరవేసలా కేంద్రానికి ఆదేశాలివ్వాలన్న పిటిషన్ ను జస్టిస్ ఎల్. నాగేశ్వరరావు, జస్టిస్ సంజయ్ కౌల్ ధర్మాసనం విచారించింది. కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కేవలం మీడియాలో వచ్చిన రిపోర్టులు, క్లిప్లింగుల ఆధారంగా పిటిషన్ వేశారని, వాటికి ఎలాంటి నిర్ధారణలు లేనందున దాన్ని కొట్టేయాలని మెహతా కోర్టుకు తెలిపారు. వలస కూలీల తరలింపునకు కేంద్రం ఇప్పటికే చాలా చర్యలు చేపట్టిందని, దేశవ్యాప్తంగా శ్రామిక్ రైళ్ల ద్వారా 10 లక్షలకుపైగా కూలీలను సొంత ప్రాంతాలకు చేరవేసిందని, రైళ్లు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నప్పటికీ.. కొందరు వినిపించుకోకుండా.. కొంచెం కూడా ఓపిక వహించకుండా నడిచి వెళ్లడానికే మొగ్గుచూపుతున్నారని కేంద్రం మాటగా మెహతా అన్నారు.
రిజిస్ట్రేషన్ కష్టంగా ఉంది..
కేంద్రం వాదనతో విభేదించిన పిటిషనర్ అలోక్ శ్రీవాస్తవ.. శ్రామిక్ రైళ్లలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉందని, అసలే చదువులేని కూలీలు టికెట్లు పొందడం కష్టంగా మారిందని, ఆ రైళ్లు ఎప్పుడొస్తాయో, ఎప్పుడు పోతాయనే సమాచారం కూడా అందరికీ అందుబాటులో లేదని కోర్టుకు చెప్పారు. అయితే జడ్జిలు మాత్రం.. కేంద్రం వాదనకే మొగ్గుచూపి, పిటిషన్ ను కొట్టిపారేశారు. వలస కూలీలకు షెల్టర్, ట్రాన్స్ పోర్ట్ కల్పించే విషయంలో కేంద్రానికి ఎలాంటి సూచనలు చేయబోమని, ఏ రాష్ట్రం ద్వారా కూలీలు నడుచుకుంటూ వెళుతున్నారో వాళ్లపై ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు.
వలస కూలీలతో వైరస్ వ్యాప్తి..
లాక్ డౌన్ నిబంధనల్ని ధిక్కరిస్తూ గుంపులుగా నడుచుకుంటూ వెళ్లే వలస కూలీల పట్ల కఠినంగా ఉండాలని, వాళ్లను సరిహద్దుల్లోకి అనుమతించొద్దని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోం శాఖ గతంలోనే ఆదేశాలు జారీచేసింది. అయితే చాలా రాష్ట్రాలు కేంద్రం సూచనను గట్టిగా అమలుచేయలేదు. మొత్తంగా వలస కూలీల కవదలికల వల్ల హిందీ రాష్ట్రాల్లో వైరస్ వేగంగా వ్యాపించినట్లు తాజా గణాంకాల్లో వెల్లడైంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్ లో గడిచిన 10 రోజుల వ్యవధిలో కేసుల సంఖ్య రెట్టింపయింది. కనీసం టెస్టులు కూడా చేయకుండా వలస కూలీలను వదిలేయడం వల్లే ఇలా జరిగిందని ఆయా రాష్ట్రాల అధికారులు చెబుతున్నారు.
ఎంత దారుణమంటే..
మార్చి 26న లాక్ డౌన్ విధించేదాకా మన నగర వాసులకు వలస కూలీల గురించి పట్టింపు లేదని, ఇప్పుడు కూడా పనులు చేయడానికి మనుషులు లేకపోవడం వల్లే కూలీల గురించి ఆరా తీస్తున్నారని ప్రముఖ సామాజికవేత్త, రామన్ మెగసెసే అవార్డీ పాలగుమ్మి సాయినాథ్ అన్నారు. ‘‘విదేశాల్లో ఎవరైనా చనిపోతే.. వాళ్ల పేర్లు, వివరాలు, ఇంట్లో విషాదకర వాతావరణమంటూ చాలా వార్తలొస్తాయి. అదే వలస కూలీలు చనిపోతే మాత్రం పేపర్లు, టీవీల్లో కనీసం వాళ్ల పేర్లు కూడా ఉచ్ఛరించరు. ఔరంగాబాద్ రైలు పట్టాలపై చనిపోయిన కూలీల్లో ఒక్కరి పేరైనా మీడియా రాసిందా? అసలు కూలీలు ఇళ్లకు ఎందుకు వెళ్లిపోతున్నారో, దానికి ఏం పరిష్కారాలు చూపాలో ప్రభుత్వాలు ఆలోచించాయా?''అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయినాథ్ ప్రశ్నించారు.