మన బ్యాంకులు భద్రమేనా? పేరుకుపోతున్న ‘ఎన్పీఏలు’, కుచ్చుటోపీ పెడుతున్న బడాబాబులు!
న్యూఢిల్లీ: మన బ్యాంకుల్లో సొమ్ము ఎంత వరకు భద్రం? ఇప్పుడు ఇదే ప్రశ్న దేశంలోని సామాన్య ప్రజానీకాన్ని వేధిస్తోంది. ఒకపక్క నిరర్ధక ఆస్తులు(ఎన్పీఏ) పెరిగిపోతున్నాయని బ్యాంకులే గగ్గోలు పెడుతుండగా, మరోవైపు వేల కోట్ల రుణాలు తీసుకుని, తిరిగి చెల్లించకుండానే విదేశాలకు చెక్కేస్తున్న నీరవ్ మోడీలాంటి బడాబాబులు!
Recommended Video
చదవండి: నీరవ్ మోడీ స్కాంలో ట్విస్ట్! అలహాబాద్ బ్యాంకులోనూ అలాగే, పట్టించుకోని యూపీఏ ప్రభుత్వం!?
రెక్కలు ముక్కలు చేసుకునే, రక్తాన్ని స్వేదంగా మార్చుకునో కాస్తో కూస్తో సంపాదించుకుని పదిలంగా ఉంటుందని బ్యాంకులో దాచుకుంటే.. ఆ కష్టార్జితం కాస్తా రుణాల పేరిట కార్పొరేట్ రాబందుల పాలవుతుంటే సామాన్యుడే మొఖం చిన్నబుచ్చుకోవలసి వస్తోంది. ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బ్యాంకులు, వాటిపైన అజమాయిషీ చేస్తున్న ఆర్బీఐ, ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు?
ఇప్పుడు బ్యాంకు పేరు చెబితేనే భయం...
ఒకప్పుడు సగటు భారతీయుడి ఆర్థిక భద్రతకు నిలువెత్తు నమ్మకంగా నిలిచిన బ్యాంకింగ్ రంగంపై ఇప్పుడు నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇన్నాళ్లూ ఇంట్లో కంటే బ్యాంకులోనే తమ సొమ్ము పదిలంగా ఉంటుందని భావించిన సామాన్యుడికి ఇప్పుడు బ్యాంకు పేరు చెబితేనే ముచ్చెమటలు పడుతున్నాయి. ఒకప్పుడు బ్యాంకులే దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా చెప్పేవారు. కానీ ఇటీవలి కాలంలో జరుగుతున్న వరుస సంఘటనల నేపథ్యంలో బ్యాంకింగ్ ముఖచిత్రమే మారుతూ వస్తోంది. బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్యుడికి నమ్మకమే సన్నగిల్లుతోంది.
ఆ ఇబ్బందులు మరువకముందే...
అసలు బ్యాంకింగ్ రంగం గురించి సామాన్యుడు పెదవి విరవడం ఇప్పుడ కొత్తగా జరిగింది కాదు. పెద్ద నోట్ల రద్దు సమయం నుంచీ ప్రజలు బ్యాంకుల కారణంగా అనేక కష్టాలు అనుభవించారు. నోట్ల రద్దు జరిగిన దాదాపు 15 నెలలు కావస్తున్నా నేటికీ ఖాతాదారులు అడిగినంత డబ్బు ఇచ్చేందుకు బ్యాంకు అధికారులు నిరాకరిస్తున్నారు. తమ శాఖలో నగదు లేదనో, రోజువారీ పరిమితి ఇంతే అనో కుంటిసాకులు చెబుతూ ఖాతాదారులను ఇబ్బంది పెడుతూ వస్తున్నారు. తాము దాచుకున్న డబ్బు తమకు తిరిగి ఇవ్వడానికే బ్యాంకు అధికారులు నానా నిబంధనలు వల్లెవేస్తుండడంతో మొదటిసారి బ్యాంకింగ్ వ్యవస్థ అంటేనే ప్రజలకు చిరాకు కలిగింది.
బ్యాంకులపై సన్నగిల్లిన నమ్మకం...
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా రుణాలు ఎగ్గొట్టి లండన్కు పారిపోవడం ఒక పెద్ద సంచలనమైతే.. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ముంబై శాఖలో రూ.11, 346 కోట్ల స్కాం బయటపడడం, ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ఆయన వ్యాపార భాగస్వాములు చేసిన మోసంతో ప్రజలకు బ్యాంకింగ్ వ్యవస్థపై ఉన్న నమ్మకమే పోయింది. బ్యాంకులు బడాబాబుల ఖజానాలుగా మారడం, తమ కష్టార్జితం రుణాల కింద కార్పొరేట్ కేటుగాళ్లు కొట్టేస్తుండడం, ఆపైన దేశం విడిచి పరారు అవుతుండడం.. గమనించాక ‘బుద్ధుంటే డబ్బు బ్యాంకులో దాచకూడదు' అని సామాన్యుడికి అనిపించడంలో ఏమాత్రం తప్పులేదు.
బయటకు రాని మోసాలు ఇంకెన్నో...
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఒక్క శాఖలోనే ఇంత భారీ ఎత్తున స్కాం జరిగితే.. దేశంలోని వివిధ బ్యాంకుల్లోకు చెందిన వేల శాఖల్లో ఎక్కడ ఏ స్థాయిలో అవకతవకలు జరుగుతున్నాయో అన్న సందేహం ఇప్పుడు అందరి మనసుల్లో కదలాడుతోంది. రాబోయే రోజుల్లో మరిన్ని స్కాంలు వెలుగుచూసే అవకాశం ఉండొచ్చని బ్యాంకింగ్ రంగ విశ్లేషకులే చెబుతుండడం మరింత భయాందోళనలు కలిగించే అంశం. మరి దేశంలోని బ్యాంకుల్లో ఈ స్థాయిలో అవకతవకలు జరుగుతుంటే.. బ్యాంకులను పర్యవేక్షిస్తున్న ఆర్బీఐగాని, ప్రభుత్వంగాని ఏం చేస్తున్నట్లు? ప్రజల సొమ్ముకు భద్రత కల్పించాల్సిన బాధ్యత వీటికి లేదా?
ఆర్బీఐ డేటా చూస్తుంటే...
ఈ నేపథ్యంలో ఆర్బీఐ అందించిన సమాచారం మరింత భయం కలిగిస్తోంది. గడిచిన అయిదు సంవత్సరాల కాలంలో (గత మార్చి ముగింపు నాటికి) దేశంలో రుణ మోసాలకు పాల్పడిన కేసుల సంఖ్య దాదాపు 8,670 వరకు ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) స్వయంగా తెలిపింది. ఈ ఎగవేతల మొత్తం దాదాపుగా రూ.61,260 కోట్ల (9.58 బిలియన్ డాలర్ల) వరకు ఉండొచ్చని పేర్కొంది. రాయిటర్స్ సంస్థ సమాచార హక్కు చట్టం కింద పెట్టుకున్న దరఖాస్తుకు స్పందిస్తూ ఆర్బీఐ ఈ వివరాలు వెల్లడించింది. అయితే బెంగళూరు ఐఐఎం అధ్యయనంలో మాత్రం 2012 నుంచి 2016 వరకు దేశంలోని బ్యాంకులు రూ.227.43 బిలియన్ల వరకు మోసపోయినట్లు పేర్కొంది.
మొండిబాకీలు 149 బిలియన్ డాలర్లు...
ఇప్పటికే దాదాపు బ్యాంకుల మొండి బాకీలు 149 బిలియన్ డాలర్లకు చేరిన నేపథ్యంలో.. కొత్త మోసాలు బ్యాంకింగ్ రంగానికి సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. 2012-13లో రూ.6,357 కోట్లుగా ఉన్న రుణ మోసాలు గత ఏడాదిలో మార్చి నాటికి దాదాపుగా రూ.17,634 కోట్లకు చేరుకున్నాయి. రాయిటర్స్ సంస్థ మొత్తం 20 ప్రభుత్వ రంగ బ్యాంకులకు అర్జీ పెట్టుకోగా కేవలం 15 బ్యాంకులు మాత్రమే రుణ మోసాల గణాంకాలను వెల్లడించాయి. మరోవైపు కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా ఇటీవల పార్లమెంటులో ఆర్బీఐ డేటాను ఉటంకిస్తూ గడిచిన ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు దాదాపు 25,600 అక్రమ రుణాల కేసుల ద్వారా డిసెంబర్ 21, 2017 నాటికి రూ.1.79 బిలియన్ల మేర బ్యాంకులు మోసపోయాయని ప్రకటించడం గమనార్హం.
రూ.లక్ష కోట్లకుపైగానే అక్రమాలు...
రుణ ఎగవేతలు ఎక్కువగ ఉన్న బ్యాంకుల జాబితాలో దాదాపు రూ.6,562 కోట్ల విలువైన 389 కేసులతో పంజాబ్ నేషనల్ బ్యాంకు ప్రథమ స్థానంలో ఉంది. రెండో స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా రూ.4,473 కోట్ల విలువైన 389 కేసులతో, రూ.4050 కోట్ల విలువైన 231 రుణ మోసాల కేసులతో బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడో స్థానంలో ఉన్నాయి. ఇక దేశంలోనే అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐలో ఇలాంటి కేసులు 1,069 వరుకు నమోదు అయ్యాయి. మొత్తంగా చూసుకుంటే దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కలిపి రుణ మోసాల విలువ దాదాపు రూ.లక్ష కోట్లకుపైగానే ఉండొచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణులే అభిప్రాయపడుతున్నారు.