Mulayam Singh Yadav : సిససైన సెక్యులరిస్ట్- యూపీలో బీజేపీ ప్రస్ధానానికి పరోక్ష కారకుడు ?
యూపీ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన దిగ్గజ నేత, సమాజ్ వాదీ పార్టీ వ్యవస్ధాపకుడు ములాయం సింగ్ యాదవ్ ఇవాళ కన్నుమూశారు. కానీ యూపీ రాజకీయాలపై ఆయన వేసిన ముద్ర మాత్రం ఎవరూ, ఎప్పటికీ చెరపలేనిది. ఆ మాటకొస్తే దేశ రాజకీయాల్లో ఏడాదికో పార్టీ మార్చే, విధేయత మార్చే, విధానాలు మార్చే నేతలున్న రోజుల్లో సెక్యులర్ వాదిగానే జీవితాంతం గడిపిన ములాయం సింగ్ యాదవ్ నేటి తరం రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలిచారు.
యూపీ రాజకీయాల్లో అయోధ్య ఉద్యమం క్రమంగా మొదలవుతున్న రోజుల్లో 1989లో తొలిసారి సమాజ్ వాదీ పార్టీని అధికారంలోకి తెచ్చిన ములాయం సింగ్ యాదవ్.. సీఎం అయ్యారు. యూపీలో తొలిసారి కాంగ్రెస్ పార్టీని మట్టికరిపించి మరో సెక్యులర్ పార్టీ ఉందన్న భరోసా కల్పించడంలో ములాయం సక్సెస్ అయ్యారు. అదే సమయంలో బాబ్రీ మసీదు వద్దకు బయలుదేరిన అయోధ్య కరసేవకుల్ని అడ్డుకునేందుకు ములాయంచాలా ప్రయత్నాలుచేశారు. చివరికి వారిని అడ్డుకునేందుకు కాల్పులు జరిపించారు. ఇందులో పలువురు కరసేవకులు చనిపోయారు. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అంతేకాదు యూపీలో, ఆ మాటకొస్తే దేశంలోనే హిందూవ్యతిరేకి అన్న ముద్ర పడటం కూడా మొదలైంది. అయినా ములాయం లెక్కచేయలేదు. తాను రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని తేల్చిచెప్పేశారు.
యూపీలో కరసేవకులపై కాల్పుల తర్వాత హిందూ ఓటుబ్యాంకులో చీలిక వచ్చింది. దీంతో సమాజ్ వాదీ పార్టీ కూడా పలు సీట్లు కోల్పోయింది. అయినా యాదవ- ముస్లిం ఓటు బ్యాంకును ఏకం చేసిన ములాయం సింగ్ 1983లో మరోసారి అధికారంలోకి వచ్చారు.అయితే ఈ వ్యవహారం ఆ తర్వాత బీజేపీకి రాజకీయంగా పనికొచ్చింది. ఆ తర్వాత యూపీలో మతపరమైన ఓట్ల ఏకీకరణ మొదలైంది. దీన్ని వాడుకున్న బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు ఇప్పుడు ఏకు మేకైపోయింది. వరుసగా రెండుసార్లు భారీ మెజార్టీతో యూపీలో గెలవడమే కాకుండా లోక్ సభ ఎన్నికల్లోనూ బీజేపీ గెలుపుకు యూపీ కారణమవుతోంది. అలా ములాయం సింగ్ యాదవ్ తాను నమ్ముకున్న సెక్యులరిజం కోసం బీజేపీ బలపడేందుకు పరోక్షంగా కారణమయ్యారు.