కటిక చీకట్లో నిర్బంధించి చిత్రహింసలు... రెప్ప వాలిస్తే ఎలక్ట్రిక్ షాక్... బయటపడ్డ చైనా అరాచకం...
అతని పేరు టోగ్లీ సింగ్కం. వయసు 21 ఏళ్లు. అరుణాచల్ ప్రదేశ్లోని సుబాన్సిరి జిల్లాలో నివసిస్తుంటాడు. అతను ఉండే ప్రాంతానికి ఇండో-చైనా బోర్డర్ సమీపంలోనే ఉంటుంది. పుట్టింది,పెరిగింది అక్కడే కావడంతో ఆ ప్రాంతంలో ఎక్కడెక్కడ ఏముందో అతనికి బాగా తెలుసు. అందుకే ప్రభుత్వ అధికారులు,మిలటరీ అధికారులు సైతం కొన్నిసార్లు అతని సాయం తీసుకుంటుంటారు. వారికి అవసరమైన వస్తువులను తరలించడంలో అతను సాయపడుతుంటాడు. అందుకు గాను కొంత డబ్బు కూడా ఇస్తుంటారు. ఇలా సాగిపోతున్న అతని జీవితం ఈ ఏడాది మార్చి 19న అనుకోని మలుపు తిరిగింది.

మార్చి 19న ఏం జరిగింది...
ఎప్పటిలాగే ఆరోజు కూడా టోగ్లీ తను ఎప్పుడూ వేటకు వెళ్లే ఓ ప్రదేశానికి వెళ్లాడు. కానీ అనుకోకుండా ఆరోజు చైనీస్ ఆర్మీ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) అతనికి ఎదురైంది. వాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో టోగ్లీకి తప్పించుకునే వీలు లేకుండా పోయింది. పీఎల్ఏ అధికారులు అతన్ని నేల మీద మోకాళ్లపై కూర్చోబెట్టి,చేతులను మెడ మీదుగా వెనక్కి మడిచి కట్టేశారు. కళ్లకు గంతలు కట్టి అక్కడినుంచి వేరే చోటుకు తరలించారు. కళ్లు తెరిచేసరికి అతను చైనీస్ ఆర్మీ స్థావరంలో ఉన్నాడు. అక్కడ బెడ్పై పడేసి విపరీతంగా కొట్టారు. అనంతరం మళ్లీ కళ్లకు గంతలు కట్టి మరోచోటుకు తరలించారు. అక్కడికెళ్లాక మళ్లీ దాడి చేశారు.

15రోజులు కటిక చీకట్లో..
ఆ దాడి తర్వాత టోగ్లీ కళ్లు తెరిచి చూసేసరికి కటిక చీకటి నిండిన ఓ గదిలో చెక్క కుర్చీపై తనను కూర్చోబెట్టినట్లు గుర్తించాడు. అలా అదే కటిక చీకట్లో అతన్ని 15 రోజుల పాటు ఉంచారు. నిద్రపోతే కొట్టేవారు.ఒక్క క్షణం రెప్పవాల్చినా ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చేవారు. ప్రతీరోజూ దాడి చేయడం,ఎలక్ట్రిక్ షాక్స్ ఇవ్వడం.. ఇలా చిత్రహింసలు పెట్టేవారు. భారత ఆర్మీ తరుపున గూఢాచర్యానికి పాల్పడుతున్నట్లు ఒప్పుకోవాలని దాడికి పాల్పడేవారు.

చేతి రాతనూ పరీక్షించారు...
కేవలం ప్యాకేజీ ఫుడ్ మాత్రమే టోగ్లీకి ఇచ్చేవారు. టాయిలెట్కి వెళ్లాల్సి వచ్చినప్పుడే కుర్చీ నుంచి లేవనిచ్చేవారు. ఇండో-చైనా బోర్డర్ను ఆనుకుని ఉన్న భారత భూభాగంలోని కొన్ని ప్రదేశాల్లో వ్యూహాత్మక బోర్డులు కొన్ని ఏర్పాటు చేయబడి ఉంటాయి. వాటిపై ఉన్న రాత టోగ్లీదే అని పీఎల్ఏ అధికారులు అనుమానించారు. దీంతో అతని చేతిరాతను కూడా పరీక్షించారు. అయితే ఆ బోర్డులపై ఉన్న రాతకు అతని చేతిరాతకు పోలిక లేదని ఆ తర్వాత గుర్తించారు.

మొబైల్తోనే కమ్యూనికేషన్...
టోగ్లీ భాష పీఎల్ఏకి రాదు... పీఎల్ఏ భాష టోగ్లీకి రాదు.. మరి కమ్యూనికేషన్ ఎలా సాధ్యపడింది. అయితే మొబైల్ ఫోన్స్ను ఉపయోగించి తాను చెప్పినదాన్ని మాండరీన్లోకి ట్రాన్స్లేట్ చేసుకుని విన్నట్లు టోగ్లీ తెలిపాడు. అలాగే వాళ్లు చెప్పేదాన్ని హిందీలోకి ట్రాన్స్లేట్ చేసి తనకు కమ్యూనికేట్ చేసినట్లు చెప్పాడు. తనను మొబైల్ ఫోన్ కూడా యూజ్ చేయమని చెప్పారని.. అయితే అది ట్రాప్ అని అర్థమై దానికి దూరంగా ఉన్నట్లు తెలిపాడు. తమ భూభాగంలో సంచరిస్తూ రహస్య ప్రాంతాల ఫోటోలు తీశావని... దాన్ని ఒప్పుకోవాలని పీఎల్ఏ తనపై ఒత్తిడి తెచ్చిందన్నాడు. అయితే తాను కేవలం వేట కోసమే వచ్చానని... అనుకోకుండా ఆర్మీకి చిక్కానని చెప్పానన్నాడు.

ఎట్టకేలకు విముక్తి
భారత అధికారుల చొరవతో ఈ ఏడాది ఏప్రిల్లో ఎట్టకేలకు చైనా చెర నుంచి టోగ్లీ విముక్తి చెందాడు.ఇండియన్ ఆర్మీ జోక్యం వల్లే తాను బయటపడ్డానని... తనను విడిపించడటంలో వారిదే కీలక పాత్ర అని చెప్పాడు. తన లాగే బోర్డర్లో ఎంతోమందిని చైనా ఆర్మీ బంధించి వేధింపులకు గురిచేస్తోందని టోగ్లీ ఆరోపించాడు. బోర్డర్ దాటి పీఎల్ఏ మన భూభాగంలోకి కూడా చొచ్చుకొస్తుందని... అయితే భారత ఆర్మీ చైనా ఆర్మీ దుందుడుకు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతుందని చెప్పాడు.












Click it and Unblock the Notifications