అసెంబ్లీ ఎన్నికలు: కమలం స్వయంకృతాపరాధం?
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అనుసరిస్తున్న విధానాలే ఆ పార్టీ స్వయంక్రుత అపరాధానికి మార్గం సుగమం చేస్తున్నాయా? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి అనుసరిస్తున్న విధానాలే ఆ పార్టీ స్వయంక్రుత అపరాధానికి మార్గం సుగమం చేస్తున్నాయా? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. దీర్ఘ కాలంగా పార్టీని అట్టిపెట్టుకుని పనిచేసిన సొంత పార్టీ శ్రేణులను కాదని ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులకు టిక్కెట్లు ఇచ్చి అందలం ఎక్కించడంపై బిజెపి నేతల్లో అతర్మధనం మొదలైంది. దీనివల్ల ప్రతికూల ఫలితాలు వస్తాయని సొంత పార్టీ నేతలే సందేహాలు వ్యక్తంచేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవాలతోపాటు శిరోమణి అకాలీదళ్ పార్టీతో కలిసి పంజాబ్లో ఏయే రాష్ట్రాల్లో గెలుపొందుతుందన్న విషయం అనిశ్చితిగా మారింది. ఆయా రాష్ట్రాల్లో బయటి నాయకులకు అవకాశాలు కల్పించడం వల్ల ఖచ్చితంగా ప్రతికూల ఫలితాలు వస్తాయని చెప్తున్నారు.
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో బిజెపి నాయకత్వం గణనీయ స్థాయిలోనే బయటి నాయకులకు టిక్కెట్లు ఇవ్వడం సొంత పార్టీ నాయకులకు, కార్యకర్తల ఆగ్రహానికి కారణమైంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో 149 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించిన బిజెపి.. ఇటీవలే పార్టీలో చేరిన 25 మంది ఇతర పార్టీల వారికి టిక్కెట్లు కేటాయించింది.
హామీల అమలుపట్ల బిజెపి నిర్లక్ష్యం..
అత్యధిక జనాభా గల రాష్ట్రంలో పార్టీ టిక్కెట్ల కేటాయింపు బిజెపిలో అసమ్మతిని రేకెత్తించింది. బిఎస్పి మాజీ నాయకుడు, యుపి అసెంబ్లీలో విపక్ష నేత స్వామి ప్రసాద్ మౌర్య 2016లోనే బిజెపి గూటికి చేరారు. కానీ తన వారికి టిక్కెట్లు కేటాయించడంలో బిజెపి అగ్ర నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల నిరసన వ్యక్తంచేశారు. తన కుటుంబ సభ్యులు, సన్నిహితులకు టిక్కెట్లు ఇప్పించుకోవడంలో విఫలమయ్యారు. ఆయన డిమాండ్లను పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో పార్టీ మారే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో గానీ, సమాజ్ వాదీ పార్టీలో గానీ చేరే అవకాశాలు ఉన్నాయి.
కాంగ్రెస్ మాజీ నేత తివారీ ఇలా..
ఉత్తరాఖండ్ మాజీ సిఎం నారాయణ్ దత్ తివారీ చేరిక కమలనాథులకు మరింత తలనొప్పులు తెచ్చి పెట్టింది. తన కుమారుడు రోహిత్ శేఖర్తోపాటు బిజెపిలో చేరిన నారాయణ్ దత్ తివారీ తన కుమారుడికి టిక్కెట్ కోసం తొలుత కాంగ్రెస్ పార్టీలో చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో సమావేశమయ్యారు. రోహిత్ శేఖర్కు పార్టీ టిక్కెట్ ఇస్తుందా? అని సందేహాలు వ్యక్తం కావడంతో బిజెపి నాయకత్వం వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. రోహిత్ శేఖర్ కేవలం పార్టీలో మాత్రమే చేరారని తెలిపింది. తివారీ పార్టీకి మద్దతు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నది.
రావత్ ప్రత్యర్థులకు చోటు..
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 64 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బిజెపి 15 మంది ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారికి అవకాశాలు కల్పించింది. ఈ నెల 16న బిజెపిలో చేరిన ఉత్తరాఖండ్ రాష్ట్ర రెవెన్యూ, నీటిపారుదలశాఖ మంత్రి యశ్ పాల్ ఆర్య, ఆయన కుమారుడు సంజీవ్, యమునోత్రి మాజీ ఎమ్మెల్యే కేదార్ సింగ్ రావత్ తదితరులకు టిక్కెట్లు కేటాయించింది బిజెపి నాయకత్వం. గమ్మత్తేమిటంటే అభ్యర్థుల జాబితా ప్రకటించిన కొద్ది సేపటి తర్వాత ఈ ముగ్గురి పేర్లు చేర్చడమే.
మాజీ కాంగ్రెసు నాయకులకు..
మరో ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇంతకుముందు ఎన్నికల్లో ఓటమి పాలైన వారికి బిజెపి నాయకత్వం టిక్కెట్లు కేటాయించడం గమనార్హం. ఇక గత ఏడాది హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో పలువురికి టిక్కెట్లు కేటాయించింది. కానీ పార్టీలో తొలి నుంచి కష్ట పడిన వారిని పక్కనబెట్టేసింది. దీని ఫలితంగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బిజెపి శ్రేణులు తీవ్ర నిరసన, ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.
ఒకరికి ఖేదం.. మరొకరికి మోదం..
బిజెపిలో టిక్కెట్ల పంపిణీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని నలుగురు సీనియర్ నేతలకు షాకిచ్చింది. తమ అభిప్రాయాలు, ఆకాంక్షలను పార్టీ నాయకత్వం పట్టించుకోకపోవడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. వారిలో కేంద్ర హొంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కూడా ఉన్నారు. సహిబాబాద్ స్థానం నుంచి తన కుమారుడు పంకజ్ సింగ్కు టిక్కెట్ ఇవ్వకపోవడం పట్ల ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.
కేంద్ర హోంమంత్రినే పట్టించుకోని వైనం..
కానీ రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్ మనుమడు సందీప్ సింగ్కు మాత్రం అట్రౌలీ స్థానం నుంచి టిక్కెట్ లభించడం గమనార్హం. సందీప్ సింగ్ తండ్రి రాజ్ వీర్ సింగ్ (కల్యాణ్సింగ్ తనయుడు) ఎతా లోక్సభ సభ్యుడు కావడం గమనార్హం. కల్యాణ్ సింగ్ మనుమడికి మాదిరిగానే తన కొడుక్కి టిక్కెట్ వస్తుందని అంచనా తప్పిపోవడంతో రాజ్నాథ్ దిగ్భ్రాంతికి గురయ్యారు.
వరుణ్ ఆశలు అడియాసలు
నెహ్రూ - గాంధీ కుటుంబ ప్రతినిధి సుల్తాన్ పూర్ ఎంపి వరుణ్ గాంధీని బిజెపి నాయకత్వం పక్కన బెట్టేసింది. పార్టీ తనను సిఎం అభ్యర్థిగా ప్రకటిస్తుందని ఆయన పెట్టుకున్న ఆశలు అడియాసలు అయ్యాయి. ఎంఎంఎస్ కుంభకోణంలో ఆయన పాత్ర ఉన్నదని వార్తలు రావడంతో ఆత్మరక్షణలో పడ్డారు.
బయటి వ్యక్తులకు అందలం
ఐదుసార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్పూర్ ఎంపి యోగి ఆదిత్యానాథ్ను కూడా బిజెపి నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కనీసం బిజెపి రాష్ట్ర ఎన్నికల కమిటీలోనూ ఆయనకు చోటు కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రీటా బహుగుణ, బిఎస్పీ నుంచి వచ్చిన స్వామి ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్ సహా 23 మంది సభ్యుల కమిటీలో చేరారు. పార్టీలో చేరుతున్నప్పుడు 30 మందికి టిక్కెట్లు ఇస్తామన్న బిజెపి.. మూడు టిక్కెట్లు మాత్రమే అవకాశం కల్పించింది. పార్టీ సీనియర్ల ప్రతిఘటనను కమలనాథులు ఏమాత్రం లెక్క చేయడం లేదు.
కేంద్రమంత్రి తీరు పట్ల నిర్లక్షం
టిక్కెట్ల కేటాయింపులో బిజెపి పంజాబ్ రాష్ట్ర నాయకత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి కేంద్రమంత్రి విజయ్ సంప్లా రాజీనామా చేశారు. తర్వాత పార్టీ నాయకత్వం నచ్చచెప్పడంతో వెనుకకు తగ్గారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సోం పర్కాష్ స్థానంలో తన సన్నిహితుడికి టిక్కెట్ ఇవ్వాలన్న విజయ్ సంప్లా అభ్యర్థనను పార్టీ నాయకత్వం పట్టించుకోలేదు.
గోవా పరివార్లోనే చిచ్చు
గోవాలో బిజెపి 2016 ఆగస్టులో ఆరెస్సెస్ రాష్ట్ర శాఖ చీఫ్ సుభాష్ వెలింగ్కర్ తిరుగుబాటుతో సతమతం అవుతున్నది. ప్రాంతీయ భాష విషయమై వెలింగ్కర్ గోవా సురక్ష మంచ్ (జిఎస్ఎం) స్థాపించారు. దీనికి తోడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన, మహారాష్ట్ర గోమంతక్ పార్టీ (ఎంజిపి)లతో కలిసి ‘మహా కూటమి' ఏర్పాటు చేయడంతో పరిస్థితి మరింత విషమించింది. 40 స్థానాల అసెంబ్లీలో 35 స్థానాలకు ఈ మహా కూటమి పోటీ చేస్తున్నది. ఇటీవలి కాలం వరకు గోవా ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న ఎంజిపి.. విభేదాల కారణంగా గత ఏడాది లక్ష్మీకాంత్ పర్సెకర్ క్యాబినెట్ నుంచి వైదొలగడంతో అధికార పార్టీలో గందరగోళం నెలకొంది. ఈ సమస్యల నేపథ్యంలో నాలుగు రాష్ట్రాల్లో ఎక్కడ నష్టపోయినా టిక్కెట్ల కేటాయింపులో లోపాలే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్తున్నారు.