అసలు కాదు కొసరు వారసులే సూపర్ హీరోలు- నాడు ఏపీలోనూ అదే తీరు..!!
Chandrababu: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. కనీవినీ ఎరుగని అత్యంత భారీ మెజారిటీని సాధించింది. శివసేన (ఏక్నాథ్ షిండే)- బీజేపీ- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) సారథ్యంలోని మహాయుటికే మరోసారి ఓటర్లు జైకొట్టారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు అనుగుణంగా ఇక్కడ ఫలితాలు వెలువడుతున్నాయి.
మొత్తం 288 నియోజకవర్గాలు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. దీన్ని అలవోకగా అందుకుంది మహాయుటి. మధ్యాహ్నానికి ఈ కూటమి అభ్యర్థులు 73 నియోజకవర్గాల్లో ఘన విజయం సాధించారు. మరో 156 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

ఎన్నో అంచనాలు ఉన్న మహా వికాస్ అఘాడీ పూర్తిగా నిరాశపరిచింది. ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. 10 సీట్లల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. 42 చోట్ల ఆధిక్యతలో కొనసాగుతున్నారు. దాదాపుగా ఏకపక్షంగా వెలువడుతున్నాయి ఇక్కడి ఫలితాలు.
ఓట్ల లెక్కింపు ఆరంభమైనప్పటి నుంచీ మహాయుటి దూకుడు కొనసాగింది. కొప్రి- పఛ్పకడీలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, నాగ్పూర్ సౌత్ వెస్ట్, బారామతిల్లో ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్.. తమ ప్రత్యర్థులపై భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
శరద్ పవార్, ఉద్ధవ్ థాకరే వంటి సీనియర్ నాయకులు సారథ్యాన్ని వహిస్తోన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ, శివసేన.. ఈ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోయాయి. బాల్ థాకరే వారసుడిగా మహారాష్ట్ర రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఛరిష్మా ఈ ఫలితాలతో తుడిచి పెట్టుకుపోయినట్టయింది.
2019 నాటి ఎన్నికల్లో 124 నియోజకవర్గాలను సొంతంగా గెలుచుకుంది శివసేన. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ఈ పార్టీ నిట్టనిలువుగా చీలింది. చీలిక వర్గ నాయకుడు ఏక్నాథ్ షిండే.. ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. అదే కుర్చీలో కొనసాగిన ఉద్ధవ్.. అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది.
ఇదే పరిస్థితి- అటు శరద్ పవార్కు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలోనూ చోటు చేసుకుంది. మహారాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన శరద్ పవార్ ప్రతిష్ఠ మసకబారినట్టే. ఈ పార్టీని నిలువునా చీల్చి బీజేపీతో చేతులు కలిపిన ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీకే ఓటర్లు పట్టం కట్టారు. వారినే ఎన్నుకున్నారు.
ఈ తరహా రాజకీయ వాతావరణం దశాబ్దాల కిందటే ఏపీలో నెలకొన్న విషయం తెలిసిందే. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి బయటికొచ్చిన చంద్రబాబు నాయుడిని ప్రజలు ఇప్పటికీ పట్టం కడుతూనే ఉన్నారు. ఆయనను అందలం ఎక్కిస్తూ వస్తోన్నారు.












Click it and Unblock the Notifications