బ్లాక్ ఫంగస్ కేసుల గుర్తింపు, చికిత్స ఎలా ? డాక్టర్లు, రోగులకు ఎయిమ్స్ మార్గదర్శకాలివే
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతుండగా.. దీంతో పాటే బ్లాక్ ఫంగస్ వ్యాప్తి కూడా పెరుగుతోంది. బ్లాక్ ఫంగస్ కారణంగా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుండగా.. మరణాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వంతో పాటు వైద్య నిపుణులు కూడా దీనిపై సీరియస్గా దృష్టిసారిస్తున్నారు. ఇదే కోవలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ధ ఎయిమ్స్ తాజాగా బ్లాక్ ఫంగస్ కేసుల గుర్తింపుతో పాటు చికిత్సా విధానంపై మార్గదర్శకాలను విడుదల చేసింది.
భారత్లో బ్లాక్ ఫంగస్ కల్లోలం
భారత్లో కోవిడ్ రోగుల్ని మింగేస్తున్న బ్లాక్ ఫంగస్పై ప్రభుత్వాతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఆందోళన పెరుగుతోంది. ఏపీ, తెలంగాణతో పాటు పలు రాష్టాల్లో ఇప్పుడు బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతున్నాయి. రాజస్ధాన్ అయితే ఏకంగా బ్లాక్ ఫంగస్ను అంటువ్యాధిగా ప్రకటించింది. కేంద్రం కూడా బ్లాక్ ఫంగస్ను నియంత్రించే విషయంలో నిపుణుల సలహాలు తీసుకుంటోంది. ఇదే క్రమంలో ఎయిమ్స్తో పాటు పలు పరిశోదనా సంస్ధలు బ్లాక్ ఫంగస్ గుర్తింపు, చికిత్సపై దృష్టిసారించాయి.
ఎయిమ్స్ మార్గదర్శకాల విడుదల
భారత్లో కోవిడ్ రోగుల పాలిట శాపంగా మారుతున్న బ్లాక్ ఫంగస్ గుర్తింపు, చికిత్సా విధానంపై ఎయిమ్స్ తాజాగా మార్గదర్శకాలు విడుదల చేసింది. మ్యూకర్మైకోసిస్గా పేర్కొంటున్న ఈ బ్లాక్ ఫంగస్ ను రోగుల్లో ఎలా గుర్తించాలి, గుర్తించాక వెంటనే తీసుకోవాల్సిన చర్యలేంటన్న దానిపై ఎయిమ్స్ స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పలు రాష్టాలకు ఇవి మార్దదర్శనం చేయనున్నాయి. ముఖ్యంగా కోవిడ్ రోగుల్లో బ్లాక్ ఫంగస్ బయటపడినప్పుడు ఎలా వ్యవహరించాలన్న దానిపై ఎయిమ్స్ మార్గదర్శకాలు ఎంతో ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
బ్లాక్ ఫంగస్ ముప్పు వీరికే
కోవిడ్ రోగుల్లో కనిపిస్తున్న బ్లాక్ ఫంగస్ ముప్పు ఎవరిలో ఇంకా ఎక్కువగా ఉంటుందన్న దానిపై ఎయిమ్స్ స్పష్టత ఇచ్చింది. దీని ప్రకారం నియంత్రించలేని డయాబెటిస్ ఉన్నవారు, హైడోస్ స్టెరాయిడ్స్ తీసుకునే వారిలో బ్లాక్ ఫంగస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందని ఎయిమ్స్ తెలిపింది. డయాబెటిక్ పేషెంట్లతో పాటు డయాబెటిక్ కీటోఎసిడోసిస్, టోసిలిజుమాబ్ డ్రగ్ తీసుకుంటున్న వారిలో బ్లాక్ ఫంగస్ సోకే అవకాశం ఎక్కువని వివరించింది. క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్నవారు, దీర్ధకాలిక వ్యాధులతో బాధపడే వారు, తీవ్రమైన కరోనా కేసుల్లో వెంటిలేటర్పై, ఐసీయూలో ఉండే వారు, ఆక్సిజన్ సపోర్ట్ తీసుకుంటున్నవారికికూడా ముప్పు తప్పదని హెచ్చరించింది.
బ్లాక్ ఫంగస్ లక్షణాలివే
బ్లాక్ ఫంగస్ గుర్తింపు, చికిత్సకు సంబంధించి ఎయిమ్స్ డాక్టర్లకు పలు సూచనలు చేసింది. ముఖ్యంగా ఈ కేసులకు చికిత్స చేసే ఆఫ్లాల్మాలజిస్టులు తమ వద్దకు వచ్చే రోగులకు డిశ్చార్జ్ అయ్యాక కూడా బ్లాక్ ఫంగస్ ముప్పు ఉంటుందని గుర్తించాలని తెలిపింది.
కరోనా రోగులు డిశ్చార్జ్ అయిన తర్వాత ముక్కులో నుంచి నలుపు రంగులో రక్తం కానీ ఇతర ద్రవాలు కానీ కారుతున్నట్లయితే బ్లాక్ ఫంగస్గా గుర్తించాలని పేర్కొంది. అలాగే కంటికి సంబంధించిన సమస్యలు, తలనొప్పి, కళ్ల నొప్పులు, కళ్లు మూసేందుకు సైతం ఇబ్బందులు పడుతున్నవారిని కూడా బ్లాక్ ఫంగస్ రోగులుగా గుర్తించాలని తెలిపింది. నోరు తెరవడం, నమలడంలో ఇబ్బందిగా ఉన్నా పరీక్షించాలని సూచించింది. ముఖంలో వాపు, నల్లబారడం, నొప్పిగా ఉండటాన్ని కూడా దీని లక్షణంగా పేర్కొంది. అలాగే నోటిలో పళ్లు వదులుగా మారడం, నొప్పిగా ఉండటం, వాపు వంటి వాటిని కూడా బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా ఎయిమ్స్ తెలిపింది.
బ్లాక్ ఫంగస్ రోగులు ఏం చేయాలంటే ?
బ్లాక్ ఫంగస్ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే ఈఎన్టీ డాక్టర్ లేదా ఆప్తమాలజిస్టును (కంటిడాక్టర్) సంప్రదించాలని ఎయిమ్స్ సూచించింది. నిరంతర చికిత్సతో పాటు ఫాలో అఫ్ కూడా ఉండాలని తెలిపింది. డయాబెటిస్ ఉన్న వారు లెవెల్స్ కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని ఎయిమ్స్ తెలిపింది. దీనికి చికిత్స తీసుకుంటూనే ఇతర తీవ్ర వ్యాధులుంటే వాటికి కూడా చికిత్స కొనసాగించాలని సూచించింది. స్టెరాయిడ్స్ తీసుకోవడం, యాంటీవైరల్ డ్రగ్లు వాడేయడం వంటి సొంత వైద్యాలు పనికిరావని కూడా ఎయిమ్స్ హెచ్చరించింది. ఇలాంటి కేసుల్లో డాక్టర్ల సూచన మేరకు ఎంఆర్ఐ లేదా సీటీ స్కాన్ తీయిస్తే వాస్తవ పరిస్ధితి తెలుసుకోవచ్చని తెలిపింది.