పునర్ వైభవం: బీజేపీ గెలుపులో ఆ ఇద్దరిదీ కీలక పాత్రే
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల్లో మరోసారి భారతీయ జనతా పార్టీ సత్తా చాటడానికి కీలకంగా వ్యవహరించారు మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, మరొకరు శ్రీరాములు అని చెప్పవచ్చు. 2013లో కేవలం 40స్థానాలకే పరిమితమైన బీజేపీ.. ఇప్పుడు ఏకంగా అధికారం చేపట్టే దిశగా పయనించింది.
Recommended Video
కానీ, 104స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఈ స్థాయిలో బీజేపీ సీట్లు గెల్చుకోవడానికి యడ్యూరప్ప, శ్రీరాములు పాత్ర ఎంతో కీలకమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యడ్యూరప్ప రాష్ట్రంలోని బలీయమైన లింగాయత్ వర్గానికి చెందిన వారు కాగా, శ్రీరాములుకు వాల్మీకి వర్గంపై మంచి పట్టుంది.
2013 అసెంబ్లీ ఎన్నికలకు ముందు యడ్యూరప్ప బీజేపీని వీడి కర్ణాటక జనతా పక్షను నెలకొల్పారు. శ్రీరాములు కూడా బడవర శ్రామిక రైతర కాంగ్రెస్ను స్థాపించారు. 2013 అసెంబ్లీ ఎన్నికల్లో యడ్యూరప్ప సారథ్యంలోని కేజేపీ 9.8శాతం ఓట్లను సాధించి ఆరు స్థానాల్లో గెలుపొందింది. బీజేపీకి పట్టున్న అనేక స్థానాల్లో వీరు ఓట్లను చీల్చడంతో బీజేపీ కేవలం 40 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.
అదే విధంగా శ్రీరాములు పార్టీ బీఎస్ఆర్ కాంగ్రెస్ కూడా బీజేపీ విజయావకాశాలను ఘోరంగా దెబ్బతీశాయి. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2014 లోకసభ ఎన్నికల ముందు మళ్లీ ఈ ఇద్దరు నేతలు బీజేపీలో చేరారు. లోకసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందారు. ఈ రెండు బలమైన వర్గాలకు చెందిన నేతలు రాకతో బీజేపీకి కలిసి వచ్చినట్లయింది. బీజేపీ 104స్థానాల్లో గెలుపొందడంలో వీరు కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని విశ్లేషకులు అంటున్నారు.