డీఆర్డీవోలో మీరు పనిచేస్తున్నారా?ఆ పని శాస్త్రవేత్తలది కదా:మోదీ ప్రకటనపై భగ్గుమన్న దీదీ, బెహన్జీ
కోల్కతా/లక్కో : యాంటీ శాటిలైట్ మిసైల్ ప్రయోగంపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. శాస్త్రవేత్తల పనితీరును కొనియాడుతున్నారు. అధికార పక్ష కూటమి ప్రశంసిస్తుంటే .. విపక్ష నేతలు దీనిని కూడా ఎన్నికల కోసం మోదీ వాడుకుంటున్నారని విరుచుకుపడ్డారు.
రాజకీయ ప్రకటన ?
మిసైల్ ప్రయోగం విజయవంతంపై ప్రధాని మోదీ కలుగజేసుకొని మాట్లాడటాన్ని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తప్పుపట్టారు. ప్రయోగం విజయవంతం గురించి శాస్త్రవేత్తలు చెబుతారు, కదా ? మీరేందుకు జోక్యం చేసుకున్నారని ఆమె ప్రశ్నించారు. మీరు ఆ పరిశోధన సంస్థలో భాగస్వాములా అని ప్రశ్నించారు. ఈ సామర్థ్యం వారి ప్రతిభకు నిదర్శనం, దానిని మీరేలా ప్రకటించి ఓటు బ్యాంకుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తారని నిలదీశారు.
ఈసీకి ఫిర్యాదు చేస్తాం
ప్రధాని మోదీ ప్రకటన మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కిందకొస్తుందని చెప్పారు మమతా. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఎన్నికల వేళ ప్రధాని కల్పించుకొని మీడియాకు వివరాలు వెల్లడించడం ఏంటని ఆమె మండిపడ్డారు.
వారి ప్రతిభ చోరీ
ఇటు బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా మోదీ వైఖరిని తప్పుపట్టారు. లైవ్ శాటిలైట్ ను కూల్చివేసి మన శాస్త్రవేత్తలు సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. కానీ దానిని ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు మోదీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. డీఆర్డీవో శాస్త్రవేత్తలకు అభినందనలు, కానీ మోదీ తీరు సరికాదని విమర్శించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈసీని కోరతామని స్పష్టంచేశారు.