‘రాహుల్కు ఆసక్తి లేదు.. మోడీతో పోరాడే శక్తి లేదు’
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై కర్నాటక గవర్నర్, కాంగ్రెస్ సీనియర్ నేత హెచ్ఆర్ భరద్వాజ్ మండిపడ్డారు. ఆయన ప్రజలకు, వాస్తవాలకు దూరంగా ఉంటున్నారని అన్నారు. రాజకీయాలపై రాహుల్ అనాసక్తితో ఉన్నారని భరద్వాజ్ అభిప్రాయపడ్డారు.
ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. భారతీయ జనతా పార్టీతో.. నరేంద్ర మోడీతో పోరాడే సత్తా కాంగ్రెస్కు లేదని అన్నారు. లలిత్ మోడీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజేలపై కాంగ్రెస్ సీనియర్ నేతలు చేస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు.
పార్లమెంటును అడ్డుకుంటామని అనడం సరికాదని సొంతపార్టీ నేతలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు కాంగ్రెస్ సహకరించాలని ఆయన కోరారు. పార్లమెంటులో ప్రజలకు ఉపయోగపడే అంశాలపై చర్చ జరగాలని అన్నారు.