బీజేపీ గెలుపుపై మోడీ హర్షం, ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు
బీజేపీపై విశ్వాసంతో ఓట్లు వేసి గెలిపించిన ఉత్తరప్రదేశ్, పంజాబ్ ప్రజలకు, ఎన్నికల్లో చెమటోడ్చి పార్టీ గెలుపునకు కారణమైన కార్యకర్తలకు ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయదుందుబి మోగించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ రెండు రాష్ట్రాల్లోని ఆ పార్టీ కార్యకర్తలు ఆనందంలో మునిగి తేలుతున్నారు. స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ కూడా తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు, పార్టీ విజయానికి కృషి చేసిన బీజేపీ కార్యకర్తలకు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. అన్ని వర్గాల ప్రజల నుంచి బీజేపీకి మద్దతు లభించడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ లలో యువతరం బీజేపీకి అండగా నిలవడం సంతోషం కలిగిస్తోందని తన ట్వీట్ లో పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చారిత్రాత్మక విజయంగా మోడీ అభివర్ణించారు. తమ పార్టీపై నమ్మకంతో ఓట్లేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు పార్టీ గెలుపునకు కృషి చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. ''పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కు నా అభినందనలు. అలాగే ఎన్నికల్లో పార్టీని గెలుపు బాటలో నడిపించిన నాయకులు, కార్యకర్తలు అందరికీ నా అభినందనలు.. కష్టపడి పనిచేసి పార్టీకి ఈ స్థాయిలో విజయాన్ని అందించిన కార్యకర్తలందరికీ నా శాల్యూట్ '' అని మోడీ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా మాటలను పునరుద్ఘాటిస్తూ.. ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ అహర్నిశలు కృషి చేస్తుందన్నారు. ''మేం ప్రతి క్షణం దేశ ప్రజల సంక్షేమం గురించే ఆలోచిస్తున్నాం. ఏ చర్య తీసుకున్నా ప్రజా శ్రేయస్సు కొరకే తీసుకుంటున్నాం. ఈ దేశంలోని 125 కోట్ల ప్రజానీకంపై మాకు విశ్వాసం ఉంది..''అని పేర్కొన్నారు.
ప్రధాని మోడీ తన ట్వీట్ లో పంజాబ్ ప్రజలకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. బీజేపీ-శిరోమణి అకాలీదళ్ కూటమిపై విశ్వాసం ఉంచి ఓటు వేయడం ద్వారా గెలిపించారని, మరో పదేళ్లపాటు ప్రజా సేవ చేసే అవకాశాన్ని తమ రెండు పార్టీలకు కల్పించారని తన ట్వీట్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications