మోడీపై ఆత్మాహుతి దాడి జరగొచ్చు: ఐబి వార్నింగ్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై బీహార్ పర్యటనలో మానవబాంబుతో ఆత్మాహుతి దాడి జరిగే అవకాశముందని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది. పాట్నాలో శనివారం ప్రధాని పర్యటించనున్నారు. ముజఫర్పూర్లో శనివారం ప్రధాని మోడీ బహిరంగసభలో ప్రసంగిస్తారు.
1991లో మాజీ ప్రధాని రాజీవ్గాంధీపై ఎలాగైతే మానవబాంబు దాడి జరిగిందో అదే తరహాలో మోడీపై జరిగే అవకాశముందని ఐబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. దీంతో బీహార్ ప్రభుత్వాన్ని, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూపు దళాలను అధికారులు అప్రమత్తం చేశారు.
మీడియాకు చెందిన వ్యక్తిగా కానీ, పోలీస్ అధికారిగా కానీ, ఎలక్ట్రిషియన్, కేటరర్, లేదా, కార్మికుడి రూపంలో మానవబాంబు ఆత్మాహుతి దాడి జరిగే అవకాశముందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
బీహార్లో ప్రధాని శనివారం బిజెపి తరపున అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు. ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా, 2013, అక్టోబర్27న పాట్నా గాంధీ మైదాన్లో జరిగిన మోడీ బహిరంగసభలో పేలుళ్లు జరిగి ఐదుగురు చనిపోయారు. సుమారు వందమంది గాయపడ్డారు.