భార్యపై భర్తే గ్యాంగ్ రేప్ చేయించాడు: నగ్నంగా రోడ్డుపై పడేశారు
తనపై భర్తకు చెందిన మిత్రులు ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది.
హైదరాబాద్: తనపై భర్తకు చెందిన మిత్రులు ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపించింది. భర్త ప్రోత్సహంతోనే వారు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె చెప్పింది. ఈ సంఘటనపై హర్యానాలోని సిర్సాలో శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది.
బాధితురాలిని ఆస్పత్రిలో చేర్పించడంతో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ నెల 29వ తేదీన ఆమెను ఆస్పత్రిలో చేర్పించినట్లు తమకు తెలిసిందని డిప్యూటీ పోలీసు సూపరింటిండెంట్ (డిఎస్పీ) రతన్ దీప్ సిగ్ బాలి చెప్పారు. తమ అధికారులు ఆస్పత్రికి వెళ్లి కేసు నమోదు చేసినట్లు కూడా తెలిపారు.
ఆమె భర్తతో సహా ఆరుగురిపై కేసు పెట్టినట్లు తెలిపారు. నిందితులపై అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రేప్ చేసిన తర్వాత తనను నగ్నంగా రోడ్డుపై పడేశారని ఆమె ఆరోపించింది.
తాను విడాకులు ఇవ్వడానికి నిరాకరించారని, దాంతో తన భర్త ముగ్గురు మిత్రులను పిలిపించి తనపై అత్యాచారం చేయించాడని, వారెవరో తనకు తెలియదని బాధితురాలు చెప్పింది. వారిని చూసి తాను పారిపోవడానికి ప్రయత్నించానని, తనను పట్టుకుని పొలాల్లోకి లాక్కెళ్లి తుపాకి గురి పెట్టి తనపై అఘాయత్యం చేశారని చెప్పిది. ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.