భర్తను సజీవ దహనం చేసిన భార్య: ఎందుకు?
చెన్నై: ఓ మహిళ తన భర్తను సజీవ దహనం చేసింది. ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా సోళదరం సమీపంలోని పుడైయూర్ గ్రామంలో జరిగింది.
పుడైయూరు గ్రామానికి చెందన నటరాజన్ (48) లారీ డ్రైవర్. అతను విదేశాల్లో పనిచేస్తున్నాడు. తాను సంపాదించిన డబ్బును భార్య ఝాన్సీరాణి (38)కి పంపిస్తూ వచ్చాడు. నటరాజన్ గత నెల స్వగ్రామానికి వచ్చాడు.
తాను పంపించిన డబ్బు గురించి అతను భార్యను అడిగాడు. మొత్తం ఖర్చు చేశానని చెప్పింది. దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. రెండు రోజుల క్రితం మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
ఆ తర్వాత స్నానం చేయడానికి ఇంటి వెనక భాగంలోకి వెళ్లాడు. ఆ సమయంలో ఝాన్సీ రాణి గోనె సంచిపై కిరోసిన్ పోసి నిప్పు అంటించి దాన్ని నటరాజన్ పైకి విసిరేసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నటరాజన్ను చిదంబరం ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు.
మెరుగైన చికిత్స కోసం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నటరాజన్ మరణించాడు. సోళదరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఝాన్సీ రాణిని అరెస్టు చేశారు.