కుటుంబమంతా చూస్తుండగానే.. భార్యను నగ్నంగా మార్చి.. నిప్పంటించేశాడు
ఆగ్రా : కట్టుకున్న ఆలిని అత్యంత కౄరంగా కడతేర్చాడు ఓ భర్త. కుటుంబ సభ్యులు, పిల్లలు చూస్తుండగానే.. భార్యను నగ్నంగా మార్చి కిరోసిన్ తో తగలబెట్టేశాడు. ప్రస్తుతం 99శాతం గాయాలతో ఆసుపత్రిలో చేరిన బాధితురాలు.. ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని డాక్టర్లు ధ్రువీకరించారు.
ఢిల్లీలోని తాజ్ గంజ్ ప్రాంతంలో ఉన్న సయిద్ నగర్ నాయి బస్తీలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. షాను అనే వ్యక్తి భార్య నీలోఫర్(27)ను చీటికి మాటికి హింసించడమే పనిగా పెట్టుకున్నాడు. గతంలోను పలుమార్లు ఆమె వ్యక్తిత్వం గురించి అవమానకరంగా మాట్లాడి ఆమెపై దాడికి పాల్పడ్డాడు.
ఇదే క్రమంలో ఆదివారం నాడు నీలోఫర్ ఒంటి మీదున్న బట్టల్ని చించేసిన షాను.. ఆమె కాళ్లు, చేతులు కట్టేశాడు. పిల్లలు, కుటుంబ సభ్యులు చూస్తుండగానే ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడు. తల్లిపై చేస్తున్న దాడికి అడ్డుపడబోయిన పెద్ద కొడుకు బలంగా నెట్టివేయడంతో అతడికి స్వల్ప గాయాలయ్యాయి. కాళ్లు చేతులు కట్టేసిన అనంతరం 5లీటర్ల కిరోసిన్ ను నీలోఫర్ పై పోసి నిప్పంటించేశాడు.
ఘటన అనంతరం షానుతో పాటు అతని కుటుంబ సభ్యులంతా పరారవగా.. చుట్టు పక్కల వారు నీలోఫర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న నీలోఫర్ కుటుంబ సభ్యులు మంటలు చల్లార్చి ఆమెను ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె 99శాతం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు.
అనంతరం నీలోఫర్ సోదరి రోషిణి మీడియాతో మాట్లాడారు. ప్రతీరోజు నీలోఫర్ ను వేధించడమే షాను పనిగా పెట్టుకున్నాడని ఆమె తెలిపారు. నీలోఫర్ పై అనుమానం పెంచుకుని.. చాలాసార్లు పిల్లల ముందు నీలోఫనర్ నగ్నంగా మార్చి దాడి చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. నీలోఫర్ బ్రతికే అవకాశాలు అసలు లేవని ఆమె చికిత్స పొందుతున్న ఎస్.ఎన్ మెడికల్ కాలేజీ డాక్టర్లు వెల్లడించారు.