అలా చేస్తే ఒక్కరోజు కలెక్టర్: షాజహాన్పూర్ కలెక్టర్ అమృతి త్రిపాఠి ఆఫర్
లక్నో: అర్జున్ - శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ఒక్కరోజు సీఎం అవుతాడు. మనం నిత్య జీవితంలో మేక్ ఏ విష్ ఫౌండేషన్ ద్వారా పలువురు ఒక్క రోజు లేదా ఒక్క గంట లేదా ఒక్కసారి కమిషనర్ అలా కావడం కూడా చూశాం. ఇప్పుడు యూపీలోని షాజహాన్పురాలో ఒక్కరోజు జిల్లా కలెక్టర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
స్వచ్ఛ భారత్ కోసం కృషి చేస్తూ తనను తాను మంచి కార్యకర్తగా నిరూపించుకుంటే సదరు వ్యక్తికి ఒక్క రోజు కలెక్టర్గా ఉండే అవకాశం ఇస్తానని యూపీలోని షాజహాన్పూర్ కలెక్టర్ అమృత్ త్రిపాఠి వినూత్నమైన ఆఫర్ ప్రకటించారు.
కళాశాల విద్యార్థుల సహాయంతో స్థానిక గ్రామాల్లోని ప్రజలకు పరిశుభ్రత గురించి తెలియచెప్పాలనే ఉద్దేశ్యంతో త్రిపాఠి ఈ ప్రకటన చేశారు. ప్రజలు శుభ్రతను పాటించేలా విద్యార్థులు ప్రోత్సహించాలని, వారికి స్ఫూర్తి కలిగేలా చేయాలని త్రిపాఠి ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్వచ్ఛ భారత్ మిషన్ కోసం పనిచేసేందుకు స్థానిక కళాశాలలకు చెందిన విద్యార్థులను కొన్ని బృందాలుగా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. వారికి కేటాయించిన గ్రామాల్లోని ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కలిగించేలా ప్రచారం చేయాలన్నారు. పరిసరాలను, ఇళ్లను శుభ్రంగా ఉంచుకునేలా చేయడంతో పాటు, మరుగుదొడ్లు ఉపయోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, దీనికి సంబంధించి విద్యార్థులకు టాస్క్లు ఇస్తామన్నారు.
అలాగే విద్యార్థులు గ్రామాల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందో లేదో చూసుకోవాలని, నిధులను సమర్థంగా గ్రామాలకు ఎలా ఉపయోగించాలో సలహాలు ఇస్తూ నివేదిక అందజేయాలన్నారు. జిల్లా పాలనా బృందం విద్యార్థుల పనితీరును పరిశీలించి, వారు చేపట్టిన పనులను సమీక్షించి ఉత్తమంగా పనిచేసిన వారిని ఎంపిక చేస్తారని, ఆ విద్యార్థికి ఓరోజు షాజహాన్పూర్ కలెక్టర్గా ఉండే అవకాశమిస్తామన్నారు.
ఆర్థిక అంశాలకు సంబంధించి ఎలాంటి అధికారం ఇవ్వకుండా ఆ రోజు అంతా తాను సదరు విద్యార్థి వెంటే ఉండి సలహాలు ఇస్తానని చెప్పారు. ఒక్కరోజుగా కలెక్టర్గా ఉండే విద్యార్థి ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు స్థానికుల సమస్యలు తెలుసుకోవాలని, తర్వాత పాఠశాలలు, గ్రామాలను తనిఖీ చేయాలన్నారు.