Encounter: నా కుమార్తె ఆత్మకు ఎప్పుడు శాంతి కల్పిస్తారు: నిలదీస్తోన్న నిర్భయ తల్లి
న్యూఢిల్లీ: హైదరాబాద్ సమీపంలోని శంషాబాద్ వద్ద వెటర్నరి డాక్టర్ దిశపై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి, హత మార్చిన నలుగురు కామాంధులను పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. పలువురు ప్రముఖులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘాతుకాలకు పాల్పడిన వారికి సరైన శిక్ష పడిందని, బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయం అందించినట్టయిందని అంటున్నారు.

సరైన శిక్ష విధించారు..
నిర్భయ తల్లి ఆశాదేవి కూడా ఎన్ కౌంటర్ పై సంతోషాన్ని వ్యక్తం చేశారు. నలుగురు నిందితులు మహమ్మద్ పాషా, జొల్లు నవీన్, జొల్లు శివ, చెన్నకేశవులును ఎన్ కౌంటర్ చేయడం తనకు ఆనందాన్ని ఇస్తోందని అన్నారు. బాధితురాలి కుటుంబానికి సత్వర న్యాయాన్ని అందించినట్లయిందని చెప్పారు. ఈ విషయంలో పోలీసుల చర్య అభినందనీయమని ప్రశంసించారు. అత్యాచార నిందితులకు సరైన శిక్ష విధించారని అన్నారు.
Recommended Video

నా కుమార్తెకు న్యాయం ఎప్పుడు చేస్తారు..
వెటర్నరీ డాక్టర్ దిశ కేసులో ఆమె కుటుంబానికి సత్వర న్యాయం అందిందని ఆశాదేవి వ్యాఖ్యానించారు. ఈ ఎన్ కౌంటర్ తో దిశ ఆత్మ శాంతించి ఉంటుందని చెప్పారు. తన కుమార్తె నిర్భయ విషయంలో కూడా పోలీసులు ఇదే తరహా చర్యలకు దిగాలని తాను కోరుకుంటున్నానని అన్నారు. ఏడేళ్లు ముగిసిపోయినప్పటికీ.. తనకు న్యాయం దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. నిర్భయ కేసులో దోషులుగా తేలిన వారు ఇంకా జీవించే ఉన్నారనే విషయాన్ని తాను పదే, పదే గుర్తు చేయాల్సి వస్తోందని వాపోయారు.

ఎక్కని గుమ్మం లేదు..
తన కుమార్తెపై అత్యాచారానికి, హత్యకు పాల్పడిన వారికి ఉరిశిక్ష విధించినప్పుడే తన కుమార్తె ఆత్మకు శాంతి లభిస్తుందని ఆశాదేవి చెప్పారు. దీనికోసం ఈ ఏడేళ్ల కాలంలో తాను ఎక్కని గుమ్మం లేదని చెప్పారు. తన కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ చాలామందిని కలిశానని, అందరూ హామీలు, భరోసాలు ఇచ్చిన వారేనని అన్నారు. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తరువాతైనా కళ్లు తెరచుకుంటారని ఆశిస్తున్నానని చెప్పారు. నిర్భయ నిందితులకు సత్వరమే ఉరి శిక్షను విధించాలని తాను న్యాయ వ్యవస్థను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.












Click it and Unblock the Notifications