అనర్హత వేటుపై రాహుల్ గాంధీ రియాక్షన్..!!
న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత, లోక్ సభ సభ్యుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్ సభ స్పీకర్ కార్యాలయం కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇంటిపేరు (Modi Surname) వ్యవహారంలో ఆయనను సూరత్ న్యాయస్థానం దోషిగా తేల్చిన నేపథ్యంలో లోక్ సభ సెక్రెటేరియట్ ఈ నిర్ణయం తీసుకుంది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 8 ఆధారంగా ఆయనపై అనర్హత వేటు వేసినట్లు వివరించింది. మోదీ ఇంటిపేరు వ్యవహారంలో సూరత్ న్యాయస్థానంలో రాహుల్ గాంధీకి రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. జైలు శిక్షను ఎదుర్కొంటోన్న పార్లమెంట్ సభ్యుడిపై- రాజ్యాంగంలోని ఆర్టికల్ 102 (1) (ఈ), ప్రజా ప్రతినిధుల చట్టం 1951లోని సెక్షన్ 8 కింద అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉంది.
రాహుల్ గాంధీని అనర్హుడిగా ప్రకంటించడం పట్ల దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు మండిపడుతున్నాయి. లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక మోసాలకు పాల్పడిన గౌతమ్ అదాని గురించి ప్రశ్నించినందుకే కేంద్ర ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని ధ్వజమెత్తాయి. అదాని కుంభకోణాన్ని కాంగ్రెస్ పార్టీ బయటపెట్టిన తరువాత పార్లమెంట్ కు ముఖం చూపించే పరిస్థితి ప్రధాని మోదీకి గానీ, బీజేపీ నాయకులకు గానీ లేదని అన్నారు. అందుకే ఇలా రాజకీయంగా కక్షసాధింపు చర్యలను తీసుకున్నారని విమర్శించారు.
తనపై అనర్హత వేటు వేయడం పట్ల తాజాగా రాహుల్ గాంధీ స్పందించారు. అనర్హత వేటుకు భయపడట్లేదని తేల్చి చెప్పారు. దేశం కోసం తన పోరాటాన్ని మరింత ముమ్మరం చేస్తానని అన్నారు. భారత్ కోసమే తాను పోరాడుతున్నానని, దీన్ని ఎవరూ ఆపలేరని తేల్చి చెప్పారు. దేశం కోసం, ప్రజల యోగక్షేమాల కోసం తాను ఎలాంటి మూల్యాన్నయినా చెల్లించుకోవడానికి సిద్ధపడ్డానని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అనర్హత వేటు వేయడం ద్వారా తనను భయపెట్టలేరని పేర్కొన్నారు.