నేను తమిళనాడు ముఖ్యమంత్రిని, బాధించింది: పన్నీరుసెల్వం
తమిళనాడు రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రిని అని పన్నీరు సెల్వం బుధవారం నాడు ప్రకటించారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్రానికి తానే ముఖ్యమంత్రిని అని పన్నీరు సెల్వం బుధవారం నాడు ప్రకటించారు. తనకు ప్రజల బలంతో పాటు ఎమ్మెల్యేల బలం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ఏఎన్ఐతో మాట్లాడారు.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు తనను చాలా బాధించాయని చెప్పారు. తదుపరి ఏర్పాట్లు చేసే వరకు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగమని తనకు గవర్నర్ చెప్పారని పన్నీరు సెల్వం అన్నారు.
శశికళని జయ నమ్మినా.. మోడీ దెబ్బ: సంక్షోభం వెనుక పెద్ద కథే!
కాగా, అంతకుముందు పన్నీరు మాట్లాడుతూ.. తానెప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదని, పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ మాట్లాడలేదని, మాట్లాడబోమని పన్నీర్ సెల్వం స్పష్టం చేశారు. అన్నాడీఎంకే అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడూ పార్టీకి విధేయుడిగానే ఉన్నానన్నారు.
తనను బీజేపీ, డీఎంకే వెనుక ఉండి నడిపిస్తోందని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఎంజీఆర్.. జయలలిత తమిళనాడుకు ఎంతో సేవ చేశారని, వారి బాటలోనే తానూ నడుస్తానన్నారు.
శశికళ పార్టీ ప్రధాన కార్యదర్శి మాత్రమేనని, త్వరలోనే ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీ శాశ్వత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటామని పన్నీర్ సెల్వం తెలిపారు. తనను పార్టీ నుంచి తొలగించే అధికారం ఎవరికీ లేదన్నారు. అమ్మ మృతి పైన అనుమానాలు ఉన్నాయన్నారు.