కృష్ణతో పోటీ పడ్డా, అభివృద్ధి చేశా: బెంగళూరులో బాబు
బెంగళూరు: ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదును తానే అభివృద్ధి చేశానని, 20 ఏళ్ల క్రితం హైదరాబాదు సాధారణ నగరంగా ఉండేదని, దాన్ని తామే ఈ స్థితికి తెచ్చామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పుకున్నారు. బెంగళూరులోని ఐటీసీ గార్డెనియాలో భారత పరిశ్ర మల సమాఖ్య (సీఐఐ) మంగళవారం రాత్రి ఏర్పాటు చేసిన సదస్సులో చంద్రబాబు ప్రసంగించారు. తాను అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఎం కృష్ణతో పోటీ హైదరాబాదును అభివృద్ధి చేసినట్లు ఆయన తెలిపారు.
నవ్యాంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆకాశమే హద్దు గా ఉందని ఐటీ, బీటీ, మౌలిక సదుపాయాలు, సేవల కంపెనీలు ముందుకు వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఏపి సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రానున్న దశాబ్ద కాలంలోనే నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని, దీనికి ఐటీ, బీటీ కంపెనీలు తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు. నవ్యాంధ్రలో పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే అనేక కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని ఆయన చెప్పారు.
దేశంలోని అతి పెద్ద కోస్తా తీరం నవ్యాంధ్రలో ఉందని ఓడ రేవుల సంఖ్యను 14కు పెంచడం ద్వారా మధ్య ప్రాచ్య, ఆసియా దేశాలకు ఎగుమతుల అవకాశాలు కల్పిస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని అయితే వీటన్నింటినీ విజయవంతంగా అధిగమించగలమన్న ఆత్మ విశ్వాసం తమకు ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాంపిటీటివ్ ఇన్నోవేటివ్ ఇండియా, డిజిటల్ ఇండియాల రూపకల్పనలో నవ్యాంధ్ర ప్రదేశ్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
రాజధానికి ఇబ్బందులు లేవు
ఆంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని విషయంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవని, కొద్దిపాటి సమస్యలు కూడా త్వరలోనే సమసిపోతాయని ఆయన భరోసా ఇచ్చారు. బెంగళూరుకు అతిసమీపాన ఉన్న అనంతపురం, హిందూపురం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ప్రాంతాల్లో ప్రాజెక్ట్లకు సరిపడినన్ని భూములున్నాయని, ఈ ప్రాంతాల్లో పెట్టుబడుల ద్వారా చక్కటి లాభాలు అందుకోవచ్చునని బాబు సూచించారు.
ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పారిశ్రామిక వేత్తలు, ఐటీ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. సదస్సునుద్దేశించి ప్రసంగించిన వారిలో ఆంధ్ర ప్రదేశ్ వాణిజ్య పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జె.ఎస్.వి. ప్రసాద్, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి అజయ్సహానీ, పరిశ్రమల శాఖ కమిషనర్ రజత్ కుమార్, ఐటీ శాఖ కార్యదర్శి కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 200 మంది పారిశ్రామిక ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు.
న్యూటానిక్స్ ఐటీ కంపెనీని చంద్రబాబు ప్రారంభించారు. న్యూటానిక్స్ కంపెనీ కేవలం ఐదేళ్లలో 50 దేశాల్లో శాఖలు ప్రారంభించడం అభినందనీయమని ఆయన ఈ సందర్భంగా అన్నారు. భారత్లో మేథస్సుకు కొదువ లేదని, రానున్న 10-15 ఏళ్లలో అమెరికా, చైనాలకు మించిన స్థాయిలో సాంకేతిక అభివృద్ధి ఇక్కడే సాధ్యమన్నారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి సవాల్గా ఉన్నా ప్రపంచం మెచ్చేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే అవకాశం కూడా తనకే దక్కిందన్నారు.
ఆధార్ ద్వారా 8 లక్షల బోగస్ పింఛన్లు, 6.5 లక్షల రేషన్కార్డులను రద్దు చేశామన్నారు. ఈ కార్డును అన్ని పథకాలకు అనుసంధానం చేస్తామని చెప్పారు. ఇదంతా ఐటీ ద్వారానే సాధ్యమైందని చెప్పారు. న్యూటానిక్స్ సీఈఓ ధీరజ్ పాండే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఐటీ సలహాదారు సత్యనారాయణలతో పాటు పలువురు ఐటీ ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పొల్గొన్నారు.
పొరుగు రాష్ట్రాలతో మంచి సంబంధాలు
ఆ తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. పొరుగు రాష్ట్రాలతో తాను ఎప్పుడూ సన్నిహితంగా ఉంటానని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు చెప్పారు. కృష్ణా జలాలకు సంబంధించి కర్ణాటక సీఎంతో చర్చలు జరిపేందుకు ఈ నెల 10వ తేదీన తిరిగి బెంగళూరుకు వస్తానని తెలిపారు.